రేపే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష..

by Sumithra |
రేపే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష..
X

దిశ, కామారెడ్డి రూరల్ : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో గ్రూపు-1 పరీక్ష కోసం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అభ్యర్థులకు సూచనలు..

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 11న ఆదివారం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష గదుల్లోకి 8:30 నుంచి 10:15 వరకు మాత్రమే అనుమతిస్తారన్నారు. పరీక్షా కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుందన్నారు.

11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..

కామారెడ్డి పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో 4549 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి తెచ్చుకోకూడనివి...

పరీక్షలు రాసే అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్ బుక్స్, పేజర్స్, టాబ్లెట్స్, బ్లూటూత్ పరికరాలు, గడియారం, వాలెట్, చేతి బ్యాగులు, నోట్స్, ఇతర ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తెచ్చుకోకూడదు.

బూట్లు ధరించరాదు..

అభ్యర్థులు బూట్లు ధరించకూడదు. చెప్పులు మాత్రమే వేసుకుని పరీక్షలకు హాజరు కావాలి.

బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి..

అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ తో ఓఎంఆర్ షీట్ లో సమాధానం బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. పెన్ మాత్రమే తెచ్చుకోవాలి.

హాల్ టికెట్ లేకపోతే...

హాల్ టికెట్ లో అభ్యర్థి ఫోటో లేకపోతే పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించి, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి. అదనంగా మరో ఫోటోతో పరీక్ష కేంద్రానికి రావాలి.

హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డు తేవాలి..

ప్రతి అభ్యర్థి హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు లేదా ఏదైనా అధికార గుర్తింపు పత్రం తప్పనిసరి తెచ్చుకోవాలి.

అభ్యర్థుల కోసం ఆర్టీసీ బస్సులు..

జిల్లాలోని దూరప్రాంతాల నుంచి అభ్యర్థులు సకాలంలో చేరుకోవడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.

144 సెక్షన్ అమలులో...

పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాలు మూసి వేయాలి.

Advertisement

Next Story

Most Viewed