కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే తరలించాలి : అదనపు కలెక్టర్

by Kalyani |
కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే తరలించాలి : అదనపు కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని రాత్రి పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి మండలం శాబ్దిపూర్ లోని కొనుగోలు కేంద్రాన్ని, క్యాసంపల్లి లోని ఓం శ్రీ వెంకటేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లును, పాల్వంచ మండలంలోని భవాని పేట భూలక్ష్మి రైస్ మిల్, గాయత్రి బాయిల్డ్ రైస్ మిల్లులను జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ధాన్యం త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు.

రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించాలని, మౌలిక వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు కూడా ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఎగిరిపోకుండా చూసుకోవాలని కోరారు. అధైర్యపడవద్దని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తామన్నారు. కాగా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం తగ్గేలా చూడాలన్నారు. అనంతరం బాయిల్డ్, రా రైస్ మిల్లులను సందర్శించి అక్కడ వేచి ఉన్న లారీల్లో ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేసుకోవాలని, ట్రక్ షీట్ జారీ చేయాలన్నారు.

రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా మిల్లులకు వచ్చిన లారీలను 24 గంటల లోగా అన్ లోడ్ చేసుకొని త్రిప్పి పంపితే తిరిగి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ చేసి పంపడానికి అవకాశముంటుందన్నారు. ఈ రబీ సీజన్ లో ఇప్పటి వరకు 42,142 మంది రైతుల నుండి 526 కోట్ల విలువ గల 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేస్తూ 84 శాతం మేర 441 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని, మిగతా డబ్బులు రైతుల ఖాతాలో త్వరలో జమచేస్తామని చంద్ర మోహన్ తెలిపారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తూ త్వరగా డబ్బులు ఖాతాలో జమ చేస్తుండడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed