ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు

by Sridhar Babu |
ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు
X

దిశ, కామారెడ్డి : ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 28 మందిని శాలువా, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మీ పాత్ర చాలా గొప్పదని, మిమ్ముల్ని మార్గదర్శకులుగా తీసుకొని మీ అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు.

ఇప్పుడు మీ వద్ద చదివేవాళ్ళు 10, 20 సంవత్సరాల్లో ఉన్నత స్థానంలో ఉంటారని, ఉపాధ్యాయుల సహకారం వల్లనే మనమందరం ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో 100 శాతం పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి పనిచేసి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని కోరారు. విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సాహించాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలిస్తూ నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు కుటుంబాలకు దూరంగా ఉంటారని, వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలన్నారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గురువుల ఔన్నత్యాన్ని గుర్తు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఈ సందర్బంగా జిల్లాలో విద్యారంగంలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయ కర్తలు ఉమారాణి, వేణుగోపాల్, నాగవేందర్, కృష్ణ చైతన్య, వెంకట రమణ రావు, జిల్లా పరీక్షల విభాగ అసిస్టెంట్ కమిషనర్ బలరాం, పరీక్షల విభాగ కార్యదర్శి నీలం లింగం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు, నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అలాగే 21 మంది ప్రొఫెసర్లను సన్మానించారు.

Next Story

Most Viewed