నత్తనడకన ‘ఎల్‌ఆర్‌ఎస్‌’..టెక్నికల్ సమస్యల, సిబ్బంది కొరత

by Aamani |
నత్తనడకన ‘ఎల్‌ఆర్‌ఎస్‌’..టెక్నికల్ సమస్యల, సిబ్బంది కొరత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నాన్ లేఅవుట్ వెంచర్లలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారి స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయడంలో అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులకు ఎదురవుతున్న పలు సమస్యలను దాటుకుని దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ అధికారులకు పెద్ద ప్రహసనంగా మారింది. టెక్నికల్ సమస్యలతో పాటు సిబ్బంది కొరత కూడా ఇబ్బందిగా మారిందంటున్నారు. దీంతో ఈ ప్రక్రియ ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. చాలా ఏళ్ల క్రితం స్థలాలు కొనుగోలు చేసిన స్థల యజమానుల వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తప్ప వెంచర్ కు సంబంధించిన లే అవుట్ నక్ష లేకపోవడంతో మోఖా మీదికి వచ్చిన అధికారులకు సంబంధిత స్థలం ఎక్కడుందో కచ్చితంగా చెప్పడానికి స్థల యాజమానులే ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

33 వేల దరఖాస్తులకు 3 వేలు కూడా దాటలే..

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్ ఆర్ ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు 33 వేలకు పైగా ఉన్నాయి.ఇప్పటి వరకు క్రమబద్దీకరణ జరిగిన అప్లికేషన్లు 3 వేలు కూడా దాటలేదు. చాలా రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతున్నా రెండడుగులు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ప్రక్రియ వేగవంతమై పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో సిబ్బంది కొరత కూడాచాలా వేధించేది. దీన్ని అధిగమించేందుకు మున్సిపల్ కమిషనర్ మకరంద్ ప్రత్యేక చొరవతో దాదాపు 30 మందికి పైగా రెగ్యులర్ సిబ్బందిని ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను రెగ్యులరైజ్ కోసం ఇతర విభాగం నుంచి డిప్యూటీ చేసి వారిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశారు. దీంతో మునుపటి కన్నా ప్రక్రియతో కొంత వేగం పుంజుకుందని అధికారులు చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో ఇబ్బందుల కారణంగా జాప్యం..

ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియలో దరఖాస్తులపై పరిశీలన చేయడానికి క్షేత్రస్థాయికి వెళుతున్న అధికారులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తరపున ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకున్న అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తు దారుడి వైపు నుంచి ఎదురయ్యే సమస్యలపై ఏం చేయలేక పోతున్నారు. కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ అందుబాటులో లేకుంటే ఆన్ లైన్ లో అప్లికేషన్ ముందుకు సాగడం లేదు. ఏ ఒక్కడాక్యుమెంట్ తక్కువగా అప్లోడ్ చేసినా దరఖాస్తును రిజెక్ట్ చేస్తోంది. రెగ్యులరైజేషన్ చేయడానికి అధికారులు దరఖాస్తు దారుడి స్థలానికి వెళ్లి అక్కడి లొకేషన్ లో సంబంధిత స్థలం ఫోటో తీసి లాంగిట్యూడ్ , లాటిట్యూడ్ వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తుదారు ఏ స్థలానికి సంబంధించి క్రమబద్దీకరణ కోరుతున్నాడన్న విషయం క్షేత్ర స్థాయిలో కొలతల ప్రకారం కచ్చితత్వంతో తెలిస్తే తప్ప ఎల్ ఆర్ ఎస్ లో ప్రాసెస్ ముందుకు సాగడం లేదు.

సరైన డాక్యుమెంట్లు అందుబాటులో లేక ఇబ్బందులు..

ఎల్ ఆర్ ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మంది వద్ద స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యమెంట్లు తప్ప లింకు డాక్యుమెంట్లు కూడా లేవు. ప్లాట్లకు సంబంధించిన వెంచర్ నక్ష కూడా అందుబాటులో లేవు. గతంలో ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు లింక్ డాక్యుమెంట్లు, నక్ష సంబంధిత ప్లాట్ ఓనర్లు తీసుకోలేదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సరిపోతుందనే ఆలోచనో లేదంటే సరైన అవగాహన లేకనో అవసరమైన లింక్ డాక్యుమెంట్లు తీసుకోకపోవడంతో ఇప్పుడు రెగ్యులరైజేషన్ విషయంలో ప్లాట్ల ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాటి కోసం స్థలానికి సంబంధిన పాత ఓనర్లను సంప్రదిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు తమ వద్ద లేవని వారు సింపుల్ గా చెబుతున్నారు.

కొందరేమో వాటి కోసం అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియను సాధ్యమైనంత స్పీడప్ చేసి దరఖాస్తు లన్నింటిని రెగ్యులరైజ్ చేసే దిశగా మున్సిపల్ కమిషనర్ సీరియస్ గా పర్యవేక్షణ చేస్తున్నారు. సిబ్బందితో అదే తీరుగా పని చేయిస్తున్నారు. ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రక్రియను కమిషనరే స్వయంగా పరిశీలిస్తూ అధికారులకు,సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.దరఖాస్తుదారులతో కూడా మాట్లాడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషనర్ మకరంద్ మంద చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed