సభాపతిగా పనిచేసిన వారు ఓడిపోతారానేది అపోహ మాత్రమే

by Sridhar Babu |
సభాపతిగా పనిచేసిన వారు ఓడిపోతారానేది అపోహ మాత్రమే
X

దిశ, బాన్సువాడ : శాసన సభాపతిగా పని చేసిన వారు ఓడిపోతారానేది కేవలం అపోహ మాత్రమేనని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తే అన్ని పటాపంచలవుతాయని బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు నిజం చేశారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యునిగా విజయం సాధించిన అనంతరం నిజామాబాద్ నగరంలోని అమృత గార్డెన్ లో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఆయన కలిశారు. శాసనసభ్యునిగా ఘన విజయం సాధించిన పోచారంకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ స్పీకర్లు ఓడిపోతారు అనేది కేవలం అపోహ మాత్రమేనని, ప్రజలతో కలిసి పనిచేస్తే విజయం సాధించవచ్చన్నారు. ప్రజలతో నిత్యం కలిసి ఉన్నాను కాబట్టే గెలిపించారన్నారు.

8 సార్లు పోటీ చేస్తే 7 సార్లు గెలిపించిన బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో మనం విజయం సాధించామన్నారు. ఇది మీ అందరి విజయమని, నాయకులు, కార్యకర్తల సమిష్టి విజయమన్నారు. ఎన్నికల కోసం అందరూ గత రెండు నెలలుగా కష్టపడ్డావారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మరో అయిదేళ్లు ప్రజాప్రతినిధిగా సేవ చేసే అవకాశం కల్పించిన బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పార్టీ ఓడిపోయిందని మనం బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజలు మార్పు కోరుకున్నారని, హుందాగా అంగీకరించాలన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని, బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినన్ని నిధులు దేశంలోని మరే నియోజకవర్గంలో కూడా చేసి ఉండకపోవచ్చన్నారు. ప్రజా తీర్పును శిరసావహించాలని, పొరపాట్లను సరిదిద్దుకుంటామని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి ప్రజా సేవకు అంకితం అవుతామన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు.

Next Story

Most Viewed