Harish Rao : పేదల కడుపు కొట్టడమే కాంగ్రెస్‌ ఏజెండా

by Kalyani |
Harish Rao : పేదల కడుపు కొట్టడమే కాంగ్రెస్‌ ఏజెండా
X

దిశ, అందోల్‌ : పెదల కడుపు నింపడమే కేసీఆర్‌ ఏజెండాగా పెట్టుకున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెదల కడుపు కొట్టడమే కాంగ్రెస్‌ ఏజెండాగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. సోమవారం అందోలు వద్ద లక్ష్మి నర్సింహ ఫంక్షన్‌ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలయ్‌–బలయ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అలయ్‌–బలయ్‌ కార్యక్రమానికి సంబంధించిన విశిష్టతను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గత బీఆర్‌ఎస్‌ పాలనలో పల్లెలన్నీ పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండేవని, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో గ్రామాల్లో పారిశుద్ద్యం అస్తవ్యస్తంగా తయారైందన్నారు.

సంజీవరావు పేటలో మంచి నీళ్లు రాకపోతే బావిలో నుంచి తీసుకొచ్చిన నీటిని సేవించి ఇద్దరు మృతి చెందారని, ఆ గ్రామ ప్రజలు కూడా ఇంకా కోలుకుంటున్నారని ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మ, దసరా పండుగలకు కేసీఆర్‌ పాలనలో కొత్త బట్టలను ప్రజలకు అందించేవారని, కాంగ్రెస్‌ పాలనలో వాటన్నింటిని తీసేసారన్నారు. రైతులకు బీఆర్‌ఎస్‌ పాలనలో దసరాలోపు రైతు బంధు పథకాన్ని అందించేవారని, ప్రస్తుత ప్రభుత్వం దసరా గడిచిన ఇంకా రైతుబంధు ఇవ్వలేదన్నారు. డిసెంబర్‌ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏడాదికి దగ్గర వస్తున్నా, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఆయన విమర్శించారు.

అసుపత్రుల్లో గర్బిణీలకు ఇచ్చే కేసీఆర్‌ కిట్‌ను బంద్‌ చేశారన్నారు. ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కాంగ్రెస్‌ విఫలమైందని, వాయిదాలు పెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర ప్రజల బతుకులు ఆగమయ్యాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు అల్లం నవాజ్‌రెడ్డి, విజయరామరాజులు మరణం పార్టీకి తీరనిలోటని, వారి మృతి పట్ల ఆయన సంతాపాన్ని తెలిపి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటెరు యాదవరెడ్డి, మాజీ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ శివకుమార్, మాజీ మార్కెట్‌ చైర్మన్‌లు పి.నారాయణ, కమ్రోద్దీన్, మాజీ జడ్పీటీసీలు మీనాక్షి సాయికుమార్, సీనియర్‌ నాయకులు పి.శివశేఖర్, రాహుల్‌ కిరణ్, బుచ్చిరెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి, వెంకటేశంతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Next Story