స్పీకర్ గా గెలిచి చరిత్ర సృష్టించా

by Sridhar Babu |
స్పీకర్ గా గెలిచి చరిత్ర సృష్టించా
X

దిశ, బాన్సువాడ : స్పీకర్ గా గెలిచి చరిత్ర సృష్టించా అని మాజీ శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభ, ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్​ఎంబీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన వారు తరువాత ఎన్నికలలో ఓడిపోతారనే పుకారు ఉండేవని, నిజంగానే గతంలో స్పీకర్లు గా పనిచేసిన వారు అందరూ ఓడిపోయారని, కానీ బాన్సువాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని తెలిపారు.

ఇంతటి ఘనవిజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు బీఆర్​ఎస్​కు వచ్చాయన్నారు. కేసీఆర్ తరువాత ఎక్కువ సార్లు విజయం సాధించిన శాసన సభ్యుడిని కూడా తానేనని చెప్పారు. రైతుబంధు రూ. 15,000 ఇస్తామని చెప్పి, మళ్లీ మనం ఇచ్చిన రూ. 10,000 లే ఇస్తున్నారని విమర్శించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, కష్టపడి అందరూ గెలవాలని కోరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టలేదని, ఆయన స్వగ్రామం ఎర్రపహాడ్ లో కూడా ఒక్క ఇల్లు కట్టలేదని అన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story