ఇంటి ఖాళీ స్థలం కబ్జా.. కుల బహిష్కరణ పై ప్రజావాణిలో ఫిర్యాదు

by Sumithra |
ఇంటి ఖాళీ స్థలం కబ్జా.. కుల బహిష్కరణ పై ప్రజావాణిలో ఫిర్యాదు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రానికి చెందిన మల్లం నర్సింలు అనే వ్యక్తికి చెందిన ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన మల్లం పోచయ్య, తోట నర్సింలు కబ్జాచేసి ఇంటి నిర్మాణం చేసుకున్నారని బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం క్రితం తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని పేర్కొన్నాడు. స్థలం కబ్జాకు సంబంధించిన పత్రాలను సైతం ప్రజావాణిలో బాధితుడు సమర్పించారు. తన ఇంటి స్థలాన్ని కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్నారని గ్రామ ఈవోకు, ఎంపీడీవోకు, డీఎల్పీవోకు, డీపీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలో ఇంటి రికార్డులు తారుమారు చేసి తప్పులుగా రికార్డులో నమోదు చేశారన్నారు. గతంలో జిల్లా అధికారులకు, గ్రామ పంచాయతీ అధికారులు, సర్పంచ్ లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు.

జిల్లా అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. హైకోర్టు నుంచి తన ఇంటి స్థలంలో ఇళ్లు కట్టవద్దని స్టే వచ్చినా స్టేని తుంగలో తొక్కి 305 గజాలకు గాను తోట నర్సింలు, మల్లం పోచయ్య ఇద్దరు కలిపి 165 గజాలు కబ్జా చేసి తన ఇంటి స్థలంలో ఇంటిని నిర్మించారని వాపోయాడు. అంతేగాకుండా తనని మల్లం పోచయ్య అనే వ్యక్తి కక్ష కట్టి కుల బహిష్కరణ చేశారని భాదితుడు మల్లం నర్సింలు తెలిపారు. కుల బహిష్కరణ కింద 95,000 చెల్లించినప్పటికీ, స్థానిక బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో తాము గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

Next Story