అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి.. చైర్మన్ బక్కి వెంకటయ్య

by Sumithra |
అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి.. చైర్మన్ బక్కి వెంకటయ్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పై సమీక్ష నిర్వహించారు. ఆయా సమస్యల పై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను నెల రోజుల్లో పరిష్కరించాలని, అవసరమైతే స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు.

నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో గడిచిన మూడు, నాలుగు దశాబ్దాల కాలంగా గ్రామాభివృద్ధి కమిటీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం వీడీసీలు కృషి చేయాలని, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చైర్మన్ సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసే గ్రామాభివృద్ధి కమిటీలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ వెంకటయ్య కలెక్టర్, సీపీలకు సూచించారు. పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పక్కాగా అమలు జరిగేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురి చేసే అధికారుల పై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తోందని తెలిపారు.

ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే, ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చక్కగా పని చేస్తున్నారని జిల్లా ప్రజలలో మంచి పేరు వినిపిస్తోందని ఈ సందర్భంగా చైర్మన్ వారిని అభినందించారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి 41 సీఆర్పీసీ కింద పోలీస్ స్టేషన్లకు పిలిపించుకుని స్టేషన్ బెయిల్ ఇస్తుండడం వల్ల అట్రాసిటీ చట్టం నీరుగారిపోయే ప్రమాదం నెలకొందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రితో చేర్చామని, ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని, న్యాయశాఖ మంత్రిని కలిసి విన్నవించనున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఎస్సీడీఓ బి.నిర్మల, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed