Sunkishala project: సుంకిశాల ప్రమాదానికి కారణం ఇదే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Sunkishala project:  సుంకిశాల ప్రమాదానికి కారణం ఇదే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సుంకిశాల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మంచి జరిగితే మాది.. చెడు జరిగితే మీది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని సుంకిశాల ఘటననను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సుంకిశాల ఘటన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆగస్టు 2వ తేదీన జరిగిందని అయినా దీనిపై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేయకుండా ఇన్నాళ్లు దాచిపెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే నొక్కిపెట్టారా? లేక ఈ ప్రభుత్వానికి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియాదా? అని నిలదీశారు. ఈ ప్రమాదం గురించి ప్రభుత్వానికి పక్కా మీకు తెలుసు. అయినా వారం రోజులు గోప్యంగా ఉంచారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం పనులు ప్రారంభిచంటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులే చెబుతున్నారని, అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగితే మళ్లీ మాపైనే చిల్లర దాడి.. చిల్లర ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమాదం జరిగింది. లేకుంటే చాలా ప్రాణనష్టం జరిగేదన్నారు. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనని, రేవంత్ రెడ్డి అసమర్థత చేతగానితనం, చేవ లేని తనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగిందన్నారు. బాధ్యతల నుంచి తప్పించుకొని గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్ విజయాలను అంగీకరించలేని కురచమనస్తత్వంతోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పరిపాలన రాక ప్రతి దానికి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ మీద విచారణ చేస్తున్నారు.

జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయండి:

కాళేశ్వరంలో జరిగితే ఎన్డీఎస్ఏ వచ్చి ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇస్తుంది కానీ సుంకిశాలకు మాత్రం ఆ కేంద్ర సంస్థ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయనడానికి నిదర్శనం అన్నారు. సుంకిశాల ప్రమాదం ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రాజెక్టు ఇంజనీరింగ్ లోపం లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలోనే లోపం ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు విధానం తప్ప.. ఇప్పటిదాకా తీసుకొచ్చిన విధానాలు ఏంటిదో చెప్పాలన్నారు. మేడిగడ్డ ఘటన జరిగినప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నా సరే ప్రమాదం జరిగిన విషయాన్ని తాము వెల్లడించామని, మాకు సీక్రెసీ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సుంకిశాల ప్రమాదాన్ని దాచిపెట్టారని ఆరోపించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు హైదరాబాద్ లోనే సీఎం ఉన్నారని, ఆ మరునాడే దాని మీద పర్యవేక్షణ లేకుండా అమెరికా వెళ్లారన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే మేము సుంకిశాలకు వెళ్లి మొత్తం వివరాలను అక్కడ నుంచి వివరిస్తామన్నారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన రాష్ట్ర సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ కు నీటి కష్టాలు రాకూడదని, హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీటి కోసం ఉపయోగ పడుతుందనే ఉద్దేశంతో సుంకిశాల ప్రాజెక్టును రైతులను ఒప్పించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మొన్నటి ఎండకాలంలో హైదరాబాద్ ట్యాంకర్లు రావటంతో ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి మీద కూడా విమర్శలు రావటంతో రెండు, మూడు నెలల కిత్రం దున్నపోతు నిద్ర వీడారని. ఆ తర్వాత అధికారులను ఒత్తిడి పెట్టి ఆగమాగం పనులు చేపట్టారని దీంతో ప్రమాదం జరిగిందన్నారు.

తప్పుడు ప్రచారాలు మానుకోండి:

సీతారామా ప్రాజెక్ట్ గురించి భట్టి విక్రమార్క బిల్డప్ ఇచ్చారని. కానీ ఆ ప్రాజెక్ట్ ను చేపట్టింది, పూర్తి చేసింది కూడా కేసీఆరేనన్నారు. కేసీఆర్ పూర్తి చేసిన ఈ పథకాన్ని మీరు పూర్తి చేసినట్టు చెప్పుకున్నప్పటికీ ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతరులపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని కేటీఆర్ అన్నారు. భట్టి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్న సరే మేడిగడ్డకు ఏమీ కాలేదు. ఇన్నాళ్లు కాళేశ్వరమంతా చిల్లర, దివాళాకోరు ప్రచారాలు. ప్రకృతే వీళ్ల తప్పుడు ప్రచారాలకు సమాధానం చెప్పింది. వీళ్లకు సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు. వీళ్లకు బ్యారేజ్ గేట్లు ఎప్పుడు దించుతారో కూడా తెలియదు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాళేశ్వరంపైన చేసిన అడ్డగోలు వాదనలు మొన్నటి వర్షాలతో తేలిపోయిందన్నారు. 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉన్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా రిజర్వాయర్లను పంపింగ్ చేసి నీళ్లు నింపుతున్నదని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంత మంచి ప్రాజెక్ట్ ను తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంజనీర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed