Shamshabad-Visakhapatnam new rail route : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైలు మార్గం..సూర్యాపేట మీదుగా సెమీ హైస్పీడ్ కారిడార్

by Y. Venkata Narasimha Reddy |
Shamshabad-Visakhapatnam new rail route : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైలు మార్గం..సూర్యాపేట మీదుగా సెమీ హైస్పీడ్ కారిడార్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే కొత్త రైల్వే లైన్ దిశగా కీలక ముందడుగు పడింది. శంషాబాద్-విశాఖపట్నం (దువ్వాడ) (Shamshabad-Visakhapatnam) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్(Semi High Speed ​​Corridor) ఎలైన్మెంట్ ఖరారైంది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మించనున్నారు. ఇది విశాఖ నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మీదుగా కర్నూలు చేరుతుంది. వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ (పెట్) సర్వే తుది దశకు చేరింది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే కానుంది. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించడం మరో విశేషం. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్ రైళ్లలో స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. గంటకు 220 కి. మీ. వేగంతో రైళ్ళు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్ కారిడార్ ను డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నానికి నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ 8.30 గంటల్లో చేరుకుంటోంది.

పెరుగనున్న వేగం.. తగ్గనున్న సమయం

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్ళు ప్రయాణిస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గం. రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ .ఈ మార్గాల్లో ప్రస్తుతం రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కి.మీ. మాత్రమే. ఈ రెండింటితో పోలిస్తే కొత్తగా రానున్న శంషాబాద్-విశాఖపట్నం మార్గం దగ్గరవుతుంది. సెమీ హై స్పీడ్ కారిడార్ రైల్వే లైన్ తో వేగం దాదాపు రెట్టింపై.. ప్రయాణ సమయం సగానికంటే తగ్గిపోతుంది.

కర్నూలు మార్గం ఇలా..

విశాఖపట్నం-శంషాబాద్ సెమీ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదిత మార్గంలో మరో కీలకాంశం కూడా ఉంది. విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు అనుసంధానం మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది రైల్వే స్టేషన్లను ప్రతిపాదించారు.

శంషాబాద్-విశాఖపట్నం సెమీ హైస్పీడ్ కారిడార్ ను పరిశీలిస్తే హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి మార్గానికి కాస్త అటూఇటూగానే కనిపిస్తోంది. తెలంగాణాలో ఇప్పటివరకు రైలు కూత వినిపించని అనేక పట్టణాలు, జిల్లాలు కొత్త కారిడార్ తో రైల్వే నెట్ వర్క్ చేరే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నార్కట్ పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి పట్టణాలకు నేటికీ రైలు మార్గం లేదు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, నాగర్ కర్నూల్ పట్టణాలకు రైల్వే మార్గం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా మొత్తంలో ఎక్కడా రైల్వే లైనే లేదు. ఇలాంటి ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఏకంగా గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు దూసుకెళ్లే సెమీ హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

ప్రతిపాదిత మార్గాలు

వరంగల్, ఖమ్మం మార్గంలో విశాఖపట్నానికి దూరం - 699 కిలో మీటర్లు. నల్గొండ, గుంటూరు మార్గంలో విశాఖపట్నానికి దూరం - 663 3.2 కిలోమీటర్లు. ప్రతిపాదిత సెమీ హైస్పీడ్ కారిడార్ లో సూర్యాపేట మీదుగా దూరం - 618కిలో మీటర్లు.

Advertisement

Next Story