‘నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..’ గుడి, బడి కామెంట్స్‌పై ఎమ్మెల్యే నాగరాజు

by karthikeya |
‘నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..’ గుడి, బడి కామెంట్స్‌పై ఎమ్మెల్యే నాగరాజు
X

దిశ, వెబ్‌డెస్క్: దేవాలయాలు కడితే బిచ్చగాళ్లం అవుతామంటూ వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన కామెంట్స్‌పై హిందూ సంఘాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. కాగా.. తన వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన కేఆర్ నాగరాజు.. తను అన్నది కరెక్టేనని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. గుడి కడితే బిచ్చగాళ్లే తయారవుతారని, అదే బడికడితే విద్యావంతులు తయారవుతారని తాను అన్నానని, అందులో ఎలాంటి వివాదం లేదని అన్నారు. హిందువులను కించపరచడం తన ఉద్దేశం కాదని, విద్యాలయాల గొప్పతనం చెప్పడానికి అలా అన్నానని పేర్కొన్నారు.

కాగా.. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఐనవోలు కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ‘‘గుడి కడితే బిచ్చగాళ్ళు అయితరు.. బడి కడితే విద్యావంతులు అయితరు’’ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతూ వెంటనే నాగరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. నాగరాజు ఇంతకుముందు కూడా దళితులపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేసి ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘మాదిగలు బ్లాక్‌మెయిలర్లు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళిత సంఘాలు మూకుమ్మడిగా ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగి క్షమాపణ కోసం డిమాండ్ చేశాయి.

Next Story