ఆ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తించదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Satheesh |
ఆ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తించదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రూ.2 లక్షల రైతు రుణమాఫీ అంశం ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని కండీషన్లు పెట్టడమే. ఈ నిబంధనలు రైతులను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. రేషన్ కార్డు రుణమాఫీకి ప్రామాణికమని ప్రభుత్వం కండిషన్ పెట్టడంతో రేషన్ కార్డులు లేని రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల ఆధారంగా కాకుండా పాస్ బుక్‌ల ప్రామాణికంగా లోన్లు మాఫీ చేసిందని.. ఇప్పుడు కూడా అదే విధానంలో లోన్లు మాఫీ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రుణమాఫీ ప్రాసెస్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ ప్రక్రియ పాత పద్దతిలోనే జరుగుతోందని స్పష్టం చేశారు.

పాస్ బుక్‌ల ఆధారంగానే రుణమాఫీ చేస్తామని.. తెలుపు రేషన్ కార్డు కేవలం లబ్ధిదారుడి కుటుంబ నిర్ధారణ కోసమేనని క్లారిటీ ఇచ్చారు. గోల్డ్ తాకట్టు పెట్టి క్రాప్ లోన్ తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించదని.. కేవలం పాస్ బుక్ ఆధారంగా తీసుకున్నవారికే రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టంగా చెప్పారు. మొత్తం 40 లక్షల మంది రైతులు అగ్రికల్చర్ లోన్లు పొందారని అందులో 11.5 లక్షల మంది రూ.లక్ష లోపు అప్పు తీసుకున్నారని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ నుండి రుణమాఫీ ప్రాసెస్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. 18వ తేదీన ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా రూ.లక్ష వరుకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ ప్రారంభం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో సంబరాలు నిర్వహిస్తామని.. సచివాలయంలో జరగనున్న సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed