ప్రభుత్వ భూములు పంచుతాం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-05 10:27:25.0  )
ప్రభుత్వ భూములు పంచుతాం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్/తిరుమలగిరి(సాగర్): ధరణి పోర్టల్‌(Dharani Portal)తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటలు ఆడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. శనివారం మంత్రి పొంగులేటి నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణిలోని లోపాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. యాచారం, తిరుమలగిరి మండలాలను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో భూమి విషయంలో రైతన్నకు ఎలాంటి భయం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ధరణి ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని అన్నారు. గతంలో భూమి లేకున్నా పాస్ పుస్తకాలు సృష్టించి రైతుబంధు తీసుకున్నారని గుర్తుచేశారు. నిజమైన రైతులకు లబ్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు ప్రభుత్వ భూములు పంచుతామని కీలక ప్రకటన చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 5 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. కాగా, తెలంగాణలో త్వరలోనే కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రానుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా చట్టాన్ని రూపొందించినట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కొత్త చట్టం రూపకల్పన విషయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని పొంగులేటి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇప్పటికే చాలా భూసమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వివరించారు. కొత్త చట్టం తీసుకొచ్చి.. అందరి భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story