పెద్దాయన, తొత్తులు తెచ్చిందే ధరణి.. KCRపై మంత్రి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు

by Rajesh |
పెద్దాయన, తొత్తులు తెచ్చిందే ధరణి.. KCRపై మంత్రి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సర్వం నాకే తెలుసునని, ఎవరు చెప్పినా వినని ఓ పెద్దాయన, ఆయనకు తొత్తుగా ఉండే అధికారి గదిలో కూర్చొని తీసుకొచ్చిందే ధరణి పోర్టల్.. కోట్లాది మంది ఆస్తులను గార్డియన్‌గా ఉండాల్సిన పెద్దలు తీరని అన్యాయం చేశారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో శుక్రవారం భూ సంస్కరణల మీద చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదోళ్ల ఆస్తులను కొల్లగొట్టారని, మాయదారి పోర్టల్‌లో భూములు మాయం చేశారన్నారు. ప్రతి ఊరిలో సామాన్యుడు భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

2020 అక్టోబరులో ధరణి పోర్టల్ లోపభూయిష్టం, అది శాపంగా మారింది. ధరణి భూ సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం గుండుసున్న అయ్యింది. అపర మేధావి, ఇద్దరు కూర్చొని చేయడంతోనే సమస్యలు తలెత్తాయన్నారు. దేశానికి దశ, దిశ అంటూ ప్రగల్భాలు పలికిన దృతరాష్ట్రుడి కౌగిలిలో ఈ పదేండ్లు ఉండింది. తెలంగాణ రైతులు కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ చట్టం ద్వారా ఎంతో నష్టం వాటిల్లింది.. సమాజ ప్రగతిని నిర్దేశించే వారు సలహాలు స్వీకరించలేదు. దాంతో శూన్య ప్రగతిని చేకూరిందన్నారు.

డీఫాల్ట్ కంపెనీతో ఒప్పందం

ప్రతి గ్రామంలోనూ వేలాది అప్లికేషన్లు వస్తున్నాయి. ఆర్వోఆర్ 2020 ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీకి అప్పగించారు. ఆ తర్వాత టెర్రాసిస్ కంపెనీగా మారింది. ఐతే ఇది దివాళా తీసిన విదేశీ కంపెనీకి 2.50 కోట్ల వివరాలను అప్పగించారన్నారు. డీఫాల్ట్ కంపెనీ అని తెలిసినా వారి తొత్తులకు భూములను అప్పగించడానికే ఇలా చేశారని ఆరోపించారు. రావణాసూరిడికి పది తలలు.. ధరణిని మూడు తలలతో మొదలు పెట్టి 33 తలలకు పెంచారు. ఎవరికీ అర్ధం గాని భూతంగా మారిందన్నారు. సామాన్యుల ఆస్తులను కనబడకుండా చేశారు. ఒక సర్వే నంబరులో కొంత భాగంపై వివాదం ఉంటే ఆ మొత్తం విస్తీర్ణాన్ని నిషేదిత జాబితాలో పెట్టడం ద్వారా లక్షల మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. మాయదారి పోర్టల్ ద్వారా మాయమైన ఆస్తులను తిరిగి పేదలకే ఇస్తామని ప్రకటించారు. పేదల ఆస్తులు దొరల పేరు మీదికి మారాయన్నారు.

చట్టంలో అనేక లోపాలు

ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సాదాబైనమాలకు అవకాశం కల్పిస్తామని అప్లికేషన్లు స్వీకరించారు. కానీ కొత్త చట్టంలో అవకాశం లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.

రివ్యూలో పది గంటలు కూర్చొంటే పెద్దాయనే మాట్లాడేవారు. మేం మాట్లాడడానికి అవకాశమే లేకుండా ఉండేది. గుండె మీద చేయ్యేసి చెప్పండి. మీరేమైనా మాట్లాడారా? అని అడిగారు. గ్రామ స్థాయిలో ఉద్యోగి లేకుండా వీఆర్వో వ్యవస్థ లేకుండా చేశారు. అసలు గ్రామ స్థాయిలో ఓ ఉద్యోగి ఉండాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.

అందరి ఆమోదంతో కొత్త చట్టం

సామాన్యులకు సమస్యలగా మారిన ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలిపేస్తాం. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు చేపట్టిన పాదయాత్రలో భూ సమస్యలే వచ్చాయని పొంగులేటి వివరించారు. అందుకే మేం ధరణి సమస్యలపై అధ్యయనానికి కమిటీ వేశాం. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం 10 గ్రామాల్లో స్టడీ పూర్తయ్యింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోనూ స్టడీ చేస్తున్నామని, మరో 15 రోజుల్లో రిపోర్ట్ వస్తుందన్నారు. ఐతే ఇప్పటికే ధరణి పోర్టల్ ని సవరించేందుకు, సమగ్ర భూ పరిపాలనకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నాం.

డ్రాఫ్ట్‌ని నేటి నుంచే ప్రజల ముందు ఉంచుతున్నాం. మూడు వారాల పాటు అన్ని వర్గాల సలహాలను స్వీకరిస్తాం. 18 వేల పుస్తకాలు చదివిన పెద్దాయన, గడి నుంచి బయటికి రాని వారు సలహాలు ఇచ్చినా ప్రజామోదం ఉంటే స్వీకరిస్తామన్నారు. వచ్చే శాసనసభలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అమల్లోకి తీసుకొస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ సంస్కరణలను, భూముల పంపకాన్ని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed