Konda Surekha: చాలా సంతోషంగా అనిపిస్తుంది

by Gantepaka Srikanth |
Konda Surekha: చాలా సంతోషంగా అనిపిస్తుంది
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ జిల్లా ఓసిటీలోని క్యాంప్ ఆఫీస్‌లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 దేశ ప్రజలందరికీ అత్యంత శుభదినమని అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడంలో ప్రధాన భూమిక రాజ్యాంగానిదేనని మంత్రి సురేఖ అన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిలపడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress Govt) ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే సర్వోత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతల ఆశయాల సాధనకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని మంత్రి సురేఖ తెలిపారు. ఈ శుభదినాన్ని పురస్కరించుకుని రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించుకోవడం అత్యంత సంతోషాన్నిచ్చిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story