ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయండి

by Sridhar Babu |
ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయండి
X

దిశ, కుత్బుల్లాపూర్ : ఎల్ఆర్ఎస్ (అనధికారిక లే ఔట్ ప్లాట్స్ క్రమ బద్దీకరణ ) ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆయన ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై వార్డు ఆఫీసర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎల్ఆర్ఎస్ సమస్యలపై ఆరా తీసిన కలెక్టర్ అనధికారిక లే ఔట్లలోని ప్లాట్స్ ను సరైన రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకునేందుకు ప్రజలకు వార్డు ఆఫీసర్స్ అందుబాటులో ఉంటూ వారి అనుమానాలు నివృత్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వార్డు ఆఫీసర్ కూడా నిర్ణీత వ్యవధిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈ నెల 31లోగా తమ ప్లాట్స్ క్రమబద్దీకరణ రుసుము చెల్లిస్తే ప్రభుత్వం నుండి 25 శాతం రాయితీ వస్తుందని తెలిపారు. 25 శాతం రాయితీ విషయాన్ని వార్డు ఆఫీసర్స్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తెలిపి క్రమబద్దీకరణ రుసుమును మొత్తం ఒకేసారి చెల్లించేలా కృషి చేయాలని ఆదేశించారు. అలాగే నిజాంపేట్ మున్సిపల్ లో ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించేలా ప్రజలను చైతన్య పరచాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో యూనిఫామ్ ట్యాక్స్ పద్దతిని అమలు పర్చడానికి కృషి చేయాలని సూచించారు. అలాగే బాచుపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీ, బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్, నిజాంపేట్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story