టాస్క్ ఫోర్స్ కమిటీ చర్యలు ఉత్తమాటేనా ?

by Sumithra |
టాస్క్ ఫోర్స్ కమిటీ చర్యలు ఉత్తమాటేనా ?
X

దిశ, కుత్బుల్లాపూర్ : గాజులరామారం సర్కిల్ లో అక్రమ నిర్మాణాలు ఎడా పెడా జరుగుతున్నాయి. జీ +2 భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్న బిల్డర్స్ బరితెగించి తమ ఇష్టానుసారం అదనపు ఫ్లోర్స్ నిర్మిస్తూ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. గాజులరామారం - సర్కిల్ 26 లోగల 125 డివిజన్ ఖైలాస్ హిల్స్ రోడ్డు నెంబర్ 3, ఖైలాస్ హిల్స్ రోడ్డు నెంబర్ 13లో అలాగే మహాదేవపురం ఐడియల్ కిచెన్ ఎదురుగా అక్రమ నిర్మాణాలను బిల్డర్స్ దర్జాగా నిర్మిస్తున్నారు. ఇక్కడి అక్రమ నిర్మాణాలని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి నోటీసులు సైతం ఇచ్చినా అక్రమ నిర్మాణాల పనులు ఏమాత్రం తగ్గడం లేదు. జీహెచ్ఎంసీ వ్యవస్థ అపహాస్యం అయ్యేలా ఇక్కడ యంత్రాంగం నీరుగారిపోవడం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. జీహెచ్ఎంసీ నిబంధనలు ప్రకారం అయితే అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసు లు రెండు దఫాలుగా ఇచ్చినప్పటికి పనులు ఆపకుండా, రిప్లై ఇవ్వకుండా యదాతదంగా నిర్మాణాలని చేపడితే షోకాస్ నోటిస్ జారి చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి.

నిద్రమత్తులో టాస్క్ ఫోర్స్ టీంలు.. అక్రమార్కులతో లోపాయికారి ఒప్పందాలే కారణమా ?

తెలంగాణ మున్సిపాలిటీల చట్టం - 2019 ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేత చేపట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలను నియమించింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ చైర్మన్ గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీంలు ప్రత్యేక నిఘా పెట్టడం, స్థానిక అధికారుల నుంచి అక్రమ నిర్మాణాల జాబితా తెప్పించుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేయ్యాలి. కానీ టాస్క్ ఫోర్స్ కమిటీలు కేవలం రికార్డుల వరకే పరిమితం కావడం, బిల్డర్స్ తో అక్రమ లావాదేవీల ఒప్పందం కుదుర్చుకోవడం మూలంగా ఎక్కడ కూడా టాస్క్ ఫోర్స్ టీం లు అక్రమార్కుల పై చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలన నుండి ఈ తంతు నేటికీ నిరంతరం కొనసాగడం రేవంత్ సర్కార్ వచ్చినప్పటికి ఏలాంటి యాక్షన్ లు లేకపోవడంతో అక్రమ నిర్మాణదారులు తమకు తోచిన విధంగా అడ్డదిడ్డంగా బిల్డింగ్ లను నిర్మిస్తూ ప్రభుత్వ ఖజానాకు చిల్లులు కొడుతూ దోచుకుంటున్నారు.

అక్రమ నిర్మాణాలు కూల్చే అధికారం మాకు లేదు..

గాజులరామారం టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి నరేష్ మాట్లాడుతూ చట్టాలను కేర్ చేయకుండా అక్రమ నిర్మాణాలను చేపడుతున్న బిల్డర్స్ పై చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు. కేవలం ఎక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుంది, ఎవ్వరి పై ఫిర్యాదులు వస్తున్నాయి విచారణ చేసి నోటీసులు ఇవ్వడం... ఆపై టాస్క్ ఫోర్స్ కమిటీకి నివేదించడమే మా డ్యూటీ అంటున్నారు. గాజులరామారం డివిజన్ లోని ఐడియల్ కిచెన్ ఎదురుగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణానికి, ఖైలాస్ హిల్స్, మహాదేవపురంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చాం. టాస్క్ ఫోర్స్ కమిటీకి కూడా చర్యలు తీసుకోవాలని వినతులు పంపించాం. కానీ చర్యలు తీసుకోవాలో లేదో టాస్క్ ఫోర్స్ కమిటీ ఇష్టం, మేమేమి చేయలేమన్నారు.

Advertisement

Next Story

Most Viewed