టన్నుల కొద్ది చెత్త రోడ్లపైనే.. ట్రాన్స్​పోర్ట్​ స్టేషన్​ ఉన్నది ఎందుకో..?

by Sumithra |
టన్నుల కొద్ది చెత్త రోడ్లపైనే.. ట్రాన్స్​పోర్ట్​ స్టేషన్​ ఉన్నది ఎందుకో..?
X

దిశ, కూకట్​పల్లి : రోడ్ల పై టన్నుల కొద్ది చెత్త పేరుకు పోయి అటు వైపు వెళ్లాలంటే చాలు ముక్కుపుటలు పగిలి పోయే దుర్గంధం. జీహెచ్​ఎంసీ అధికారులు నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో కైత్లాపూర్​ డంపింగ్​ యర్డు సమీపంలో రోడ్ల పై చెత్త గుట్టలు గుట్టలుగా పడి కంపు కొడుతుంది. చెత్త సేకరణ బాధ్యతలు తీసుకున్న కార్పొరేట్​ సంస్థ రాంకి చేత కాని తనంతో డంపింగ్​ యార్డు నాలుగు దిక్కుల సుమారు రెండు వందల మీటర్ల మేర చెత్త పేరుకు పోయి ఉంది. అంతే కాకుండా చెత్త సేకరణ పనులలో, స్వచ్చ ఆటోలలో బాల కార్మికులు పని చేస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు.

గ్రేటర్​ హైదరాబాద్​ నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వ హయాంలో జీహెచ్​ఎంసీ రాంకి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కాలనీలలో చెత్త తొలగించడం, స్వచ్చ ఆటోలలో వచ్చిన చెత్తను డంపింగ్​ యార్డ్​లో సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాంకీ సంస్థ పై నిఘా వైఫల్యం కారణంగా కేవలం డంపింగ్​ యార్డులో ఉండాల్సిన చెత్త డంపింగ్​ యార్డుకు నాలుగు దిక్కుల కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంది. కైత్లాపూర్​ డంపింగ్​ యార్డు సమీపంలోని 15 ఫేజ్​, కైత్లాపూర్​ గ్రామం, 4వ ఫేజ్​, కేపీహెచ్​బీ కాలనీ పలు ఫేజ్​లలో లక్షలాది సంఖ్యలో ప్రజలు నివాసం ఉంటున్నారు. రాత్రుళ్లు డంపింగ్​ యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందులు ఎదురుకుంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు కాలనీల వాసులు దుర్వాసనతో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు, రాత్రుళ్లు ఇంట్లో ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేల టన్నుల చెత్త..

మూసాపేట్​ సర్కిల్​ పరిధిలోని కైత్లాపూర్​లో ఉన్న డంపింగ్​ యార్డును నిర్వహణ రాంకి సంస్థ ఆధీనంలో ఉంది. కూకట్​పల్లి, మూసాపేట్​ జంట సర్కిళ్లతో పాటు పక్కనే ఉన్న చందానగర్​ సర్కిల్​తో పాటు ప్రైవేటు సంస్థల నుంచి సేకరించే వేల టన్నుల చెత్త కైత్లాపూర్​ డంపింగ్​ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్​ యార్డులో స్వచ్చ ఆటోలు, టిప్పర్ల ద్వారా వచ్చే చెత్తను డంప్​ చేసేందుకు క్యూలో వేచి చూడాల్సి వస్తుండటంతో స్వచ్చ ఆటోలు రోజుకు కనీసం రెండు ట్రిప్పులు చెత్తను సేకరించాల్సి ఉంటుంది. దీంతో క్యూలో ఉండకుండా ఆటో డ్రైవర్​లు చెత్తను డంపింగ్ యార్డు బయటనే డంప్​ చేసి వెళ్లి పోతున్నారు. అంతే కాకుండా చెత్త లోపలికి వెళ్లిన తర్వాత అందులో ఉన్న ప్లాస్టిక్​ బాటిళ్లు, పేపర్లు, కవర్లు, వేరు చేసుకునే వీలు ఉండకపోవడంతో స్వచ్ఛ ఆటో డ్రైవర్​లు చెత్తను బయట డంప్​ చేస్తున్నారు. చెత్త సేకరణలో ఉన్న స్వచ్చ ఆటోలను మైనర్​లు నడుపుతున్నారు. చెత్త వేరు వేరు చేసే పనులలో బాల కార్మికులు పని చేస్తున్నారు. వీరిపై నిఘా ఉంచాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు.

చెత్త కుప్పల మధ్య నుంచే కోర్టుకు..

కూకట్​పల్లి కోర్టు ప్రాంగణం వెనుక భాగంలోనే డంపింగ్​ యార్డు ఉంది. కోర్టుకు వెళ్లాలంటే 15 ఫేజ్​ నుంచి డంపింగ్​ యార్డు పక్క నుంచి ఉన్న సీసీ రోడ్డును లేదా హైటెక్​ సిటీ ఎంఎంటీఎస్​ రైల్వే స్టేషన్​ పక్కనే ఉన్న రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కోర్టుకు వెళ్లే వారందరు చెత్తకుప్పల మధ్య నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కోర్టుకు వేళ్లేందుకు ఆ రోడ్డు గుండా వచ్చే వారు చెత్త కుప్పలను చూసి రోడ్డు లేదని తిరిగి వేరే దారి నుంచి వెళుతున్నారు. 15వ ఫేజ్​ నుంచి అంబేద్కర్​ నగర్​, కోర్టు ప్రాంగణానికి వెళ్లే రోడ్డును లక్షలాది నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు పూర్తిగా చెత్తను కుప్పలుగా పోసేందుకు వినియోగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed