రేవంత్‌ది వ్యవసాయం చేసిన మొఖమేనా...? : హరీశ్ రావు

by Naresh N |
రేవంత్‌ది వ్యవసాయం చేసిన మొఖమేనా...? : హరీశ్ రావు
X

దిశ, ములుగు: రోడ్లు లేక నాడు ఎంతో ఇబ్బందులు పడుతుండే నేడు డబుల్ రోడ్లు కనిపిస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం మర్కుక్ మండలంలోని గజ్వేల్ నియోజకవర్గం అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మర్కుక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారే తప్ప గ్రామాల్లో వారికి ఎలాంటి స్పందన లేదన్నారు.

కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే తాము కూడా పెద్దవాళ్లం అవుతామని ఈటల రాజేందర్, నర్సిరెడ్డి అనుకుంటున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పత్తా లేడని వ్యంగాస్త్రం వేశారు. కేసీఆర్ పై పోటీకి దిగడమే తప్పు ఇప్పుడు హుజూరాబాద్, గజ్వేల్‌లో రెండు స్థానాల్లో ఈటలకు డిపాజిట్ కూడా గల్లంతవుతుందన్నారు. కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరని హరీశ్ రావు అన్నారు. మర్కుక్ దశ, దిశ మార్చింది కేసీఆర్ అని నీళ్ల కష్టాలు తీర్చాడన్నారు. గతుకుల గజ్వేల్ ను ఇప్పడు బతుకుల గజ్వేల్ చేసిండన్నారు. నెత్తిమీద గంగమ్మ లెక్క కొండపోచమ్మ సాగర్ తెచ్చింది కేసీఆర్ అని, మా మండలం కేసీఆర్‌దే అని గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు.


తెలంగాణకు తొలి సీఎం కేసీఆర్ అయ్యారని, దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం కూడా కేసీఆర్ అవుతారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మర్కుక్ మండలంలో నాయకులకు కష్టంలో లేడు, సుఖంలో లేరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారన్నారు. ఎవడో వచ్చి బిడ్డ బిడ్డ అంటే నమ్మితే మోసపోతాం అన్నారు. ఇంకొకడు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండదు, అభివృద్ధి ఉండదు మోసపోయి కూడా ఓటు వేయొద్దన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారని మంత్రి అన్నారు. ఈసారి కారు గెలవగానే సన్నబియ్యం, అవికూడా పాత బియ్యం ఇవ్వబోతున్నామన్నారు. అసైన్డ్ ల్యాండ్స్‌కి పట్టా ఇచ్చి వారికీ హక్కులు ఇవ్వబోతున్నమని తెలిపారు.

బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఒకటో, రెండో సీట్లు గెలుచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేస్తారన్నారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బుతుల్లోనే బుద్ది చెప్పాలని గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నీ మంచి మెజారిటీతో గెలిపించాలని వారు సూచించారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్ వస్తది బీఆర్ఎస్ వస్తే 24 కరెంటు ఉంటదన్నారు. 30 తేదీన అందరం కారుకు గుర్తుకు ఓటువేసి గజ్వేల్‌లో పెద్ద సారు కేసీఆర్ కి నాకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలన్నారు. బీఆర్‌ఎస్‌ని గెలిపించాలని కోరారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, ప్యాక్స్ వైస్ చైర్మెన్ బాల్ రాజు, ఆయా గ్రాముల సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story