- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్ : 31మంది మావోయిస్టులను కోల్పోయిన చత్తీస్ గడ్ బస్తర్ ఎన్ కౌంటర్ పై ఎట్టకేలకు మావోయిస్టు పార్టీ అధికారికంగా స్పందించింది. ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఎన్ కౌంటర్ జరిగిన 9 రోజుల తర్వాత బస్తర్ డివిజనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. "ఎన్ కౌంటర్ జరిగిన రోజు ఉదయం 6 గంటలకు అన్ని వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయని, భోజనం చేస్తున్న సమయంలో దాడికి పాల్పడ్డారని, ఒకే రోజు ఆరు సార్లు ఎదురు కాల్పులు జరిపారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఉదయం 6:30 నుంచి 11 గంటల వరకు కాల్పులు జరిగాయని, గ్రామం చుట్టూ భద్రతా బలగాలు మోహరించాయని, శిబిరాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేస్తూనే శత్రువులను ప్రతిఘటిస్తూ వెళుతుండగా మరో వైపు నుంచి కూడా కాల్పులు మొదలయ్యాయని వివరించింది.
ధైర్యంగా ఎదురు కాల్పులు ప్రారంభించినప్పటికి భద్రతా బలగాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది సహచరులు చనిపోగా 12 మంది సహచరులు గాయపడ్డారని, 15 నిమిషాల ప్రతిఘటన తర్వాత మళ్లీ గాయపడిన సహచరులతో కలిసి వెళ్లామని, నాల్గవసారి మళ్లీ కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో మరో నలుగురు సహచరులు గాయపడ్డారని, అక్కడి నుంచి 30 నిమిషాల దూరం వెళ్లిన తర్వాత శత్రువులు ఎల్ ఫార్మేషన్లో కూర్చుని కాల్పులు జరిపారని తెలిపింది. ఇక్కడి నుంచి రెండు జట్లు విడిపోయాయని, ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన కాల్పులు రాత్రి 9 గంటల వరకు అడపాదడపా 11 సార్లు కొనసాగాయని, ఆ కాల్పుల్లో మా సహచరులు 14 మంది మృతి చెందారని, గాయపడిన 17 మంది మావోయిస్టులను పట్టుకుని 5వ తేదీ ఉదయం 8 గంటలకు భద్రతా బలగాలు కాల్చి చంపాయని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
బస్తర్ డివిజనల్ కమిటీ మృతి చెందిన మావోయిస్టులకి నివాళులర్పించినట్లు పేర్కొంది. విప్లవకారులు, ప్రజానీకం తమ నెరవేరని కలలను సాకారం చేసుకునేందుకు దృఢ సంకల్పంతో పని చేయాలని తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ విజ్ఞప్తి చేసింది. అమరవీరులందరినీ స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహించాలని పత్రికా ప్రకటనలో పేర్కొంది.