బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు.. ఎస్పీ టి.శ్రీనివాస రావు

by Sumithra |
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు.. ఎస్పీ టి.శ్రీనివాస రావు
X

దిశ, గద్వాల : సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో సాగాల్సిన పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో ఆపరేషన్ ముస్కాన్ 10వ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తప్పిపోయిన పిల్లలను, స్కూల్స్ డ్రాప్ ఔట్ అయిన వారిని గుర్తించడం, భిక్షాటన, బాలకార్మికులు, మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ మొదలైనవాటిలో నిమగ్నమైన వారిని రక్షించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ - 10 పనితీరు పై చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో బాలకార్మిక వ్యవస్థ ఒక వ్యాధిలాగా మారిందని, అది ఎంతో మంది అమాయక పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తోందని పేర్కొన్నారు. ప్రధానంగా తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వెట్టిచాకిరీ కోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, తమ పిల్లలను మాత్రం వెట్టిచాకిరీ కూపంలోకి నెట్టకూడదని, పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, ప్రజలు కూడా దాన్ని తమ నైతిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

జిల్లా పరిధిలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ కు పంపకుండా పత్తి పొలాలలో పనులు చేయించడం వల్ల వాళ్ల బంగారు భవిష్యత్ ను వారే నియత్రించినట్లు అవుతుందని ఆ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని కోరారు. బాలికల మిస్సింగ్ కేసులు జరిగితే పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి పెడతామని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో చిన్నారుల కోసం పని చేసే వివిధ శాఖల అధికారులు కూడా తరచూ పాఠశాలలు, కళాశాలలు సందర్శించి బాల్య వివాహాలు, స్కూల్ డ్రాప్ ఔట్ జరగడం వల్ల కలిగే నష్టల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్కూల్ డ్రాప్ ఔట్ అయిన చిన్నారుల తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వివిధ శాఖలు "ఆపరేషన్ ముస్కాన్-10" ద్వారా నిరాశ్రయులైన పిల్లలను, భిక్షాటనలో చిక్కుకున్న పిల్లలు, బాలకార్మికులను బలవంతంగా రక్షించడం పునరావాసం కల్పించడం లక్ష్యంగా 1 జూలై 2024 నుండి 31 జూలై 2024 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు. ఇందుకోసం ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, నలుగురు పోలీసు కానిస్టేబుల్‌లు ఉండేలా (ఒక మహిళా పోలీసు హెడ్ కానిస్టేబుల్‌తో సహా) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, చిన్నారుల కోసం పని చేసే వివిధ శాఖల లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పని చేసి అనాథ పిల్లలను చేరదీయడంతో పాటు వెట్టిచాకిరి నుండి విముక్తి కల్పించాలని అన్నారు.

చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపడం ప్రభుత్వ శాఖలతో పాటు తల్లిదండ్రులకు, బాధ్యత గల ప్రతి పౌరునికి ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. అనంతరం అందుకు సంబంధించిన పోస్టర్స్ ను జిల్లా ఎస్పీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సహదేవుడు, సభ్యులు జయభారతి, సైలజ, జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ అధికారి మహేశ్ కుమార్, ముష్కాన్ టీమ్ ఇంచార్జి ఎస్సై కేశవ రావు, పోలీస్ సిబ్బంది డీఈఓ ఆఫీస్ అధికారి వెంకటేశ్వర రావు, వైద్య శాఖ అధికారి రాజు, RDO ఆఫీస్ ఏ.ఓ విజయ్ కుమార్, dcpo నరసింహ పలు NGO సంఘాల అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed