రేవంత్ రెడ్డి అనుభవశూన్యుడు.. మంత్రి పదవి చేసిన అనుభవం లేదు : డీకే అరుణ

by Disha Web Desk 23 |
రేవంత్ రెడ్డి అనుభవశూన్యుడు.. మంత్రి పదవి చేసిన అనుభవం లేదు : డీకే అరుణ
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవ శూన్యుడని,కేసీఆర్ పై ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే గాలిలో గెలిచిన పార్టీ నీది అని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు.సోమవారం స్థానిక పద్మావతీ కాలనీలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.రేవంత్ రెడ్డి కి మంత్రిగా పనిచేసిన అనుభవం లేదని,ఒక రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో తెలియని అనాలోచితుడని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.రేవంత్ రెడ్డి అహంకారం తగ్గించుకో,విర్రవీగితే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుందని ఆమె శివమెత్తారు.ఓటు కు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవని,ప్రధానమంత్రిని గురించి మోడీ కేడీ అని నోటికొచ్చినట్లు మాట్లాడుతావా అని,మోడీ కాలి గోటికి కూడా సరిపోవని ఆమె విరుచుకుపడ్డారు.

అరుణమ్మది కల్తీ రక్తమా? ఒక మహిళా నేతను పట్టుకొని కల్తీ రక్తమంటావా? మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? వారిని ఎవరైనా ఇలాగే విమర్శిస్తే నీకు ఎలా ఉంటుందని ఆమె చల్లా వంశీచంద్ రెడ్డి అన్న వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.డీకె అరుణ ను విమర్శిస్తేనే నీకు గుర్తింపు లభిస్తుందనే విషయం అర్థమైందని,స్థాయిని మరిచి చిల్లరగా మాట్లాడుతున్నావని ఆమె ఫైర్ అయ్యారు.'వికసిత్ మహబూబ్ నగర్' సాధనే తన లక్ష్యం అని,పాలమూరులో విద్య,వైద్యం,ఐటీ,ఇండస్ట్రీయల్,మహిళా సాధికారతే లక్ష్యంగా స్పెషల్ మ్యానిఫెస్టో తో ముందుకు వెళుతున్నానని, పాలమూరు ప్రజలు బీజేపీ కమలం పువ్వు గుర్తు కే తమ ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి,అంజయ్య,రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed