ఎస్సైలపై బదిలీ వేటు.. జడ్చర్లలో కానిస్టేబుల్ డీఏఆర్‌కు అటాచ్

by Shiva |
ఎస్సైలపై బదిలీ వేటు.. జడ్చర్లలో కానిస్టేబుల్ డీఏఆర్‌కు అటాచ్
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: అక్రమ ఇసుక రవాణా, ఇతర దందాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారనే కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని నలుగురు ఎస్సైలు, మహబూబ్‌ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పై బదిలీ వేటు పడింది. ఈ మేరకు మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోకపోవడం, ప్రత్యక్షంగా, పరోక్షంగా అక్రమ వ్యాపారులకు అండగా ఉంటున్నారని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీంతో ఆ ఫిర్యాదుల ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల ఎస్సైగా పని చేస్తున్న లెనిన్, వంగూరు ఎస్సై మహేందర్, తెలకపల్లి ఎస్సై నరేష్, బిజినపల్లి ఎస్సై నాగ‌శేఖర్‌రెడ్డి, చిన్నంబావి ఎస్సై రమేష్‌లను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

త్వరలోనే వారిని లూప్‌లైన్‌కు బదిలీ చేస్తారని సమాచారం. ఇసుక తదితర వ్యవహారాలలో ఫిర్యాదుల కారణంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆనంద్‌ను డీఏఆర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా వనపర్తి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి అప్పులు తీసుకుని వాటిని చెల్లించే విషయంలో తలెత్తిన సమస్యల కారణంగా వారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీసు యంత్రాంగం అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయి వివరాలను సేకరించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed

    null