మూసీ అభివృద్ధి ఫోరం పేరుతో రూ.1000 కోట్లు తీసుకొచ్చి ఎలాంటి అభివృద్ధి చేయలేదు

by Kalyani |   ( Updated:2024-10-11 13:01:38.0  )
మూసీ అభివృద్ధి ఫోరం పేరుతో రూ.1000 కోట్లు తీసుకొచ్చి ఎలాంటి అభివృద్ధి చేయలేదు
X

దిశ, జడ్చర్ల : గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు మూసీ అభివృద్ధి ఫోరం పేరుతో జపాన్ లో రూ. 1000 కోట్లు తీసుకువచ్చి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు మాత్రం బావబామ్మర్దులైన కేటీఆర్, హరీష్ రావు ముసీ బాధితుల పక్షాన మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఐదు విడతలుగా రుణమాఫీ చేస్తే వడ్డీలకే సరిపోయిందని, కానీ రేవంత్ సర్కార్ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించారని అన్నారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలోని బాలనాగరం మండలం పెద్దపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ ట్రైన్ స్వీడెన్షియల్ పాఠశాల శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ జానకి, బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తంగేళ్ల జ్యోతి లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని, రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు ధీటుగా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తీసుకురానుందని, అందులో భాగంగా పెద్దయపల్లి సమీపంలో 150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. మరోవైపు నిజాం కాలంలో మూసీనది తాగునీటికి అనుకూలంగా ఉండేదని, కానీ రాను రాను ఇండస్ట్రియల్ కంపెనీల ద్వారా విడుదల జలాల నుండి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు వేలాదిమంది రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీంతో పాటు నల్గొండ జిల్లా కూడా పూర్తిగా కలచితంగా మారిందని మంత్రి పేర్కొన్నారు.

మూసే అభివృద్ధి ఫోరం పేరుతో జపాన్ వద్ద రూ.1000 కోట్లు తీసుకువచ్చి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా నేడు రాజకీయ పబ్బం కోసం మూసీ పరివాహక ప్రాంత గృహ నిర్మాణదారులకు అండగా ఉంటున్నామంటూ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో ప్రతి నెల రూ. 6వేల కోట్లు తాము వడ్డీ చెల్లిస్తున్నామని, ఆయిన కూడా తమ ప్రభుత్వ హయాంలో నెల నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇలా పది నెలల కాలంలో తమ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

కొట్లాడి పనులు చేపించుకునే ఎమ్మెల్యే దొరకడం జడ్చర్ల ప్రజల అదృష్టం

జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి ఏదైనా పని కావాలంటే దాన్ని కోసం ఎంతకైనా తెగిస్తాడని, అందుకు నిదర్శనం ఉదందాపూర్ నిర్వాసితులకు వెంటనే వారికి అందాల్సిన పరిహారం చెల్లించాలని, లేదంటే తాను అధికార పార్టీ ఎమ్మెల్యే ని అయినా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తానని చెప్పి ఉదండాపూర్ భూ నిర్వాసితులకు రూ. 45 కోట్ల రూపాయలు విడుదల చేయించుకున్నాడని అన్నారు.

అదేవిధంగా నేడు పెద్దపల్లి వద్ద శంకుస్థాపన చేసుకున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా మొదటగా మంజూరు లిస్టులో లేదని ఎమ్మెల్యే పట్టుబట్టి మరి పెద్దపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయించుకుని నేడు ప్రారంభించుకున్నాడని అన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం జడ్చర్ల నియోజకవర్గ ప్రజల అదృష్టం అని ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతుందని జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ తో పాటు బద్మి శివకుమార్ డీఈవో రవీందర్, మండల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story