బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్ పాస్

by Gantepaka Srikanth |
బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్ పాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగులు సేవాస్ఫూర్తిని చాటడం అభినందనీయమని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న సిబ్బందిని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. బుధవారం బస్ భవన్‌లో మణుగూరు డిపో డ్రైవర్ కోటేశ్వరరావు, గద్వాల్ డిపో కండక్టర్ కిషోర్ కుమార్, డ్రైవర్ నరేందర్ గౌడ్, జగిత్యాల డిపో మేనేజర్ సునీతలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సత్కరించారు. మణుగూరు డిపోకు చెందిన బస్సులో గత ఏడాది డిసెంబర్‌ 21న ప్రయాణికురాలి 10 తులాల బంగారు అభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె విలపిస్తూ పీహెచ్‌బీ డ్రైవర్‌ కోటేశ్వరరావుకు చెప్పారు. వెంటనే బస్సును భద్రాచలం బస్ స్టేషన్‌లో ఆపి స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక ప్రయాణికురాలు వేగంగా వెళ్తున్న విషయాన్ని డ్రైవర్ గమనించి ఆమెను అనుసరించారు. బంగారు అభరణాలున్న బ్యాగ్ వేరే ప్రాంతంలో పెడుతుండగా గుర్తించారు. అభరణాలను అపహరించిన మహిళను పోలీసులకు అప్పగించారు. పోలీసుల సహకారంతో 10 తులాల బంగారు ఆభరణాలను ప్రయాణికురాలికి ఇప్పించారు.

బస్సులో ప్రసవం.. ఆర్టీసీ సిబ్బంది ఉదారత..

గద్వాల డిపోకు చెందిన బస్సులో జనవరి 2న రాయచూర్ నుంచి గద్వాలకు ప్రయాణిస్తుండగా ఒక గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్‌ కిషోర్‌ కుమార్‌ డ్రైవర్‌ నరేందర్‌ గౌడ్‌‌కు సమాచారం ఇవ్వడంతో 108కు సమాచారం ఇచ్చారు. అంతలోనే పురిటినొప్పులు ఎక్కువ కావడంతో తోటి ప్రయాణికురాళ్లు సహకరించాలని కోరడంతో వారు పురుడుపోయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం తల్లి బిడ్డను ఆస్పత్రిలో చేర్చించారు.

ప్రయాణికురాలికి గుండెపోటు.. డీఎం సీపీఆర్‌

జగిత్యాల బస్‌ స్టేషన్‌‌లో జనవరి 12న ప్రయాణికురాలికి గుండెపోటు వచ్చింది. సంక్రాంతి ఆపరేషన్స్‌‌లో భాగంగా అక్కడే విధులు నిర్వహిస్తున్న జగిత్యాల డీఎం సునీత వెంటనే అప్రమత్తమై ఆమెకు సీపీఆర్‌ చేశారు. అనంతరం 108 సాయంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించారు. డీఎం సకాలంలో స్పందించడంతో ప్రయాణికురాలికి ప్రాణాప్రాయం తప్పింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు గద్వాల డిపో బస్సులో జన్మించిన ఆడపిల్లకు జీవిత కాలం ఉచిత బస్ పాస్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీవోవో డాక్టర్‌ రవిందర్‌, ఈడీలు మునిశేఖర్‌, ఖుస్రోషా ఖాన్‌, రాజశేఖర్‌, ఫైనాన్స్‌ అడ్వైజర్‌ విజయపుష్ప, హెచ్‌ఓడీలు విజయభాస్కర్‌, వెంకన్న, శ్రీదేవి, ఉషాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed