- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తా.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్లో పాల్గొన్న బీసీవాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజు నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. సీఎం దగ్గర ప్రతి ఒక్కరూ బానిసలుగా పడి ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారని.. కానీ, తీన్మార్ మల్లన్న విషయంలో అది సాధ్యం కాదని అన్నారు.
తనను పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఆగుతుందనే భ్రమ ఉంటే ప్రభుత్వ పెద్దలు ఆ భ్రమను తొలగించుకోవాలని హెచ్చరించారు. తాము వెనుకటి బీసీలం కాదని.. ఆధునీకరించుకుని, ఆలోచన మెరుగుపరుచుకుని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులమని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో తప్పులు దొర్లాయని.. సర్వే రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని అన్నారు. బీసీలు, ప్రజలను మోసం చేసేందుకు చేపట్టిన సర్వే రిపోర్టు చిత్తు కాగితమనే తాను తగులబెట్టానని క్లారిటీ ఇచ్చారు. బీసీకు న్యాయం జరగాలని కోరి తగులబెట్టడం తప్పు అయితే.. ఆ తప్పును తాను వెయ్యి సార్లు చేస్తానని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచే కులగణన చేయబోతున్నాం, తమ జన్మలు సార్థకం అయ్యాయంటూ ప్రభుత్వ పెద్దలు డైలాగులు కొట్టారని.. సర్వేను తప్పుదోవ పట్టించారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలని ఉంటే.. సర్వే ప్రారంభమైన తొలిరోజే సీఎం ఆయన ఇంట్లో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి ఇళ్లలో సర్వేలో పాల్గొని అందరికీ ఆదర్శంగా ఉండేలా చూపించే వాళ్లని కామెంట్ చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవేమి జరగలేదని ధ్వజమెత్తారు
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెప్పట్టిన సకల జనుల సర్వేకు విపరీతమైన స్పందన వచ్చిందన్నారు. దుబాయ్, బొంబాయి, ఇతర దేశాలకు వలస వెళ్లిన వాళ్లు సైతం సర్వేలో పాల్గొన్నారని తీన్మార్ మల్లన్న అన్నారు. కానీ, నేటి ప్రభుత్వం తూతూమంత్రంగా సమగ్ర సర్వే చేపట్టిందని ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కులగణనపై నిత్యం మానిటరింగ్ చేయాలని.. కానీ, సీఎం రేవంత్ రెడ్డి సర్వే ముగిశాక సమీక్ష చేపట్టారని ఫైర్ అయ్యారు. సమగ్ర సర్వేలో బీసీల లెక్కను తక్కువ చూపారంటూ రిపోర్టు తప్పని తాను తగులబెడితే.. ప్రభుత్వం మళ్లీ రీసర్వే ఎందుకు చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. 3.54 లక్షల ఇళ్లలో సర్వే జరగలేదని.. మరో 16 లక్షల మంది సర్వేలో ఎంట్రీ కావాలని సర్కార్ లెక్కలు చెప్పిందని, కానీ ఆ సంఖ్యను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తీసుకుందో అర్థం కావడం లేదన్నారు. ఇది కేవలం ఈడబ్ల్యూఎస్ను రక్షించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వేసిన పెద్ద ఎత్తుగడ అని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనలాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి నచ్చదని.. ప్రభుత్వంలో బీసీలకు జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాననే పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఫైర్ అయ్యారు. 6.98 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారంటూ నాలుగైదు సార్లు సీఎంకు వినతి పత్రం ఇచ్చానని అన్నారు. కానీ, ఆ విషయం తనకేమీ తెలినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం అత్యంత జుగుప్సాకరంగా ఉందని కామెంట్ చేశారు. నూటికి 67 శాతంగా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్.. సరిగ్గా 10 శాతం లేని అగ్ర వర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా అని తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే పక్కా అయితే.. సీఎం రేవంత్రెడ్డి ఆ సర్వేకు బాధ్యత వహించాలని సవాల్ విసిరారు. సర్వేపై చర్చకు సీఎం రెడీ అంటే.. తాను ఎక్కడి రమ్మన్నా సిద్ధమేనని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పులతడక అని నిరూపిస్తానని స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. బీసీల కోసమే పోరాటం చేస్తానని తీన్మాన్ మల్లన్న అన్నారు.