సింగరేణి భూముల కబ్జాకు పోటా పోటీ..!

by srinivas |
సింగరేణి భూముల కబ్జాకు పోటా పోటీ..!
X

దిశ, కొత్తగూడెం రూరల్: సింగరేణి కోల్ బెల్ట్‌గా ముద్ర వేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ఆస్తులు విస్తారంగా ఉన్నాయి. అయితే కొంత భూమిలో సింగరేణికి సంబంధించిన పరిశ్రమలు ఉండగా మరికొంత భూమి అక్కడక్కడ ఖాళీగా ఉండటంతో వాటిపై కబ్జాదారులు కన్నేసి దశలవారీగా స్థలాలను ఆక్రమిస్తున్నట్లుగా కొంతమంది సింగరేణి మాజీ కార్మికులు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డు కూలీ లైన్ ఏరియాలో గతంలో కార్మికుల కోసం సింగరేణి యాజమాన్యం క్వార్టర్లను నిర్మించారు. అయితే అవి కాలం చెల్లి కూల్చి వేశారు. దీంతో ఏర్పడిన ఖాళీ స్థలాన్ని యాజమాన్యం కొంత ప్రభుత్వానికి అప్పగించింది. ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన పండ్ల దుకాణాలు నిర్వహించే చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక దుకాణాలతో పాటు కూరగాయలు అమ్మే వ్యాపారులకు సైతం సముదాయాలు ఏర్పాటు చేశారు. నిర్మాణాలు జరగగా సింగరేణికి సంబంధించిన కొంత భూమి కూలి లైన్ ప్రాంతంలో అక్కడక్కడ మిగిలి ఉంది. ఈ భూములు నెలల తరబడి ఖాళీగా కనిపించడంతో కబ్జాదారులు, కొందరి రాజకీయ నాయకుల అండతో ఎలాగైనా ఆక్రమించాలని లక్ష్యంతో పోటాపోటీ పడటం గమనార్హం.

సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ స్థలం ఆక్రమణ...సింగరేణి కోల్ బెల్ట్‌గా ముద్ర వేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ఆస్తులు విస్తారంగా ఉన్నాయి.

కొత్తగూడెం సూపర్ బజార్ ఏరియా ఎంజీ రోడ్డుకు పక్కన సింగరేణి వ్యాపార కాంప్లెక్స్ ఉండగా దీన్ని వెనక ఉన్న ఖాళీ స్థలం గతంలో కొంత ఆక్రమణకు గురికాగా తాజాగా మరికొంత స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించి నిర్మాణం చేపట్టాడు. ఈ విషయం సింగరేణి ఎస్టేట్ అండ్ సెక్యూరిటీ విభాగానికి తెలియడంతో వారు స్పందించి నిర్మాణం జరిగిన ప్రదేశం వద్ద అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆక్రమణ విషయంలో కబ్జా చేసిన వ్యక్తికి సెక్యూరిటీ సిబ్బందికి పలుమార్లు ఘర్షణ సైతం జరిగింది.

సింగరేణి స్థలంలో వాటర్ ప్లాంట్..

గతంలో పాత సింగరేణి క్వార్టర్లను కూల్చివేసిన స్థలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు వాటర్ ప్లాంట్ కోసం నిర్మాణ పనులు ప్రారంభించి, స్లాబ్ లెవెల్ వరకు తీసుకువచ్చాడు. ఈ నిర్మాణం ఇల్లీగల్‌గా జరుగుతుందని సింగరేణి ఎస్టేట్ విభాగానికి సెక్యూరిటీ వారికి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణ ప్రదేశానికి సెక్యూరిటీ చేరుకొని గదికి మెట్లు ఏర్పాటు చేస్తున్న కర్ర సెంట్రింగ్‌ను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు.

ఖాళీ స్థలాల కబ్జా

మున్సిపాలిటీ పరిధిలోని కూలీ లైన్ ప్రాంతంలో ఉన్న సింగరేణి కాళీ స్థలాలను కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు పోటాపోటీ పడుతుండటం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో ఖాళీ స్థలాల్లో సింగరేణి సెక్యూరిటీ హెచ్చరిక బోర్డులను పెట్టినా వాటిని రాత్రి సమయంలో తొలగించి అక్రమ నిర్మాణాలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ఆక్రమణదారులపై గట్టి చర్యలను తీసుకునేందుకు సింగరేణి ఎస్టేట్ విభాగం సెక్యూరిటీ సాహసించలేక పోతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

హైడ్రాతోనే సింగరేణి ఆస్తులకు రక్షణ:రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థి, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్

కొత్తగూడెం పట్టణంలోని కూలి లైన్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న సింగరేణి ఆస్తులు రక్షించాలంటే ఆపరేషన్ హైడ్రా సిస్టం తీసుకురావాల్సిందే. కూలిలైన్‌లో సింగరేణి శిథిలావస్థకు చేరిన క్వార్టర్ స్థలంలో వాటర్ ప్లాంట్ పేరిట జరుగుతున్న నిర్మాణ పనులపై సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. భవిష్యత్తులో సింగరేణి ఆస్తులు ఆక్రమణల పాలు కాకుండా ఉండాలంటే హైడ్రాతోనే సాధ్యం.

సింగరేణి ఆస్తులను కాపాడటమే లక్ష్యం: జాకీర్ హుస్సేన్, సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్

సింగరేణి ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తాం. కూలీ లైన్ ఏరియాలో సింగరేణి స్థలంలో జరుగుతున్న అక్రమ కట్టడాన్ని అడ్డుకున్నాం. ఖాళీ స్థలాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయిస్తాం. సింగరేణి భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.

Next Story

Most Viewed