BRS: మౌన ‘గులాబీ’..! జిల్లాలో పత్తాలేని నాయకులు, కేడర్

by Shiva |
BRS: మౌన ‘గులాబీ’..! జిల్లాలో పత్తాలేని నాయకులు, కేడర్
X

దిశ బ్యూరో, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం అస్త్ర సన్యాసం చేసినట్లు కనిపిస్తుంది. ఏ నియోజకవర్గంలో చూసినా గులాబీ నాయకులు సైలెంట్‌గా ఉంటున్నారు. అక్కడి మాజీలు ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ఓడిన తర్వాత ఒక్క నాయకుడు కూడా కేడర్‌కు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఇదే కంటిన్యూ అయితే బీఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందేనని అంటున్నారు. ఒకరిద్దరు మాజీలు అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వస్తున్నా తూతూమంత్రంగా మమ అనిపిస్తూ కారెక్కి వెళ్లిపోతున్నారని, గతానికి ఇప్పటికి మాజీల ప్రవర్తనలో చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. వైరా సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెస్తున్నాయి.

గుండు సున్నా కారణమా..?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కటే స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత 2018లో ఒక్క స్థానానికే పరిమితమైంది. మూడోసారి 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా తిరిగి ఒక్క సీటే దక్కడం.. ఆ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఆధిపత్యం శూన్యం. అయితే, 2014, 2018 ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమని అధికార పార్టీలో చేరిపోయారు. కొందరు మాత్రం గెలిచిన పార్టీలో ఉండి పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పని చేశారు. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నా.. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరడం.. కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు బీఆర్ఎస్‌లో చేరడంతో కాలం వారి ఆశలన్నీ అడియాశలు చేసింది. 2023లో అధికారం కాంగ్రెస్ వశమైంది. అయితే ఈ దఫా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులెవ్వరూ ఎమ్మెల్యేలుగా లేకపోవడంతో ‘గుండుసున్నా’ గేలి చేయడంతో ఆ పార్టీ నాయకులు సైలెంట్ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

బీఆర్ఎస్‌కు బలమేలేదని తేల్చిన సీఎం..

కాంగ్రెస్ పార్టీలో జిల్లాకు చెందిన హేమాహేమీలైన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండటంతో బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థకు చేరిందని, జిల్లాలో బీఆర్ఎస్‌కు ఏమి ఉందంటే గాడిద గుడ్డు మాత్రమేనని వైరాలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా, బీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా, అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, ప్రజలు తనకు అండగా ఉంటే భవిష్యత్తులో బీఆర్ఎస్‌ను బద్దలుకొట్టి, బొందపెట్టే బాధ్యతను తీసుకుంటానని వెల్లడించడంతో అటు కాంగ్రెస్ శ్రేణులు మరింత జోష్‌లో ఉండగా.. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఏమీ మాట్లాడకుండా మిన్నకుండటం గమనార్హం.

48 గంటలు గడిచినా..

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ముగిసి రెండు రోజులైనా జిల్లాకు చెందిన నాయకులు ఎవ్వరూ స్పందించలేదు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేరిట కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులే.. రీ డిజైన్ పేరిట సీతారామగా మారిందని, కాంగ్రెస్ హయాంలో పెట్టిన ఖర్చు తప్ప.. బీఆర్ఎస్ చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గణాంకాలతో సహా విడమర్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతంలో వేసిన పునాదులను తామే అధికారంలోకి వచ్చాక తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకున్నామని, గోదావరి జలాలను కృష్ణా జలాలకు పారించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. రీడిజైన్ పేరిట కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఉమ్మడి ఖమ్మం జిల్లాను పడావు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు.

భట్టి విక్రమార్క లెక్కలతో చెప్పిందంతా వాస్తమేనని, అందువల్లే బీఆర్ఎస్ నాయకులు కొందరు భుజాలు తడుముకుంటున్నారని ఆ పార్టీలోని కొందరు నాయకులే అంటున్నారు. దాంతో బీఆర్ఎస్ పార్టీలోని ఒక్క నాయకుడు కూడా స్పందించలేక పోతున్నాడని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ హవా కొనసాగడం ఖాయంగా భావిస్తున్నాయి. కాంగ్రెస్‌కు కౌంటర్‌గా జిల్లాలోని బీఆర్ఎస్‌లోని జిల్లా ప్రధాన నాయకులు ఎవ్వరూ కూడా మాట్లాడకపోవడం, జిల్లా అధ్యక్షుడు మాత్రమే అడపాదడపా కౌంటర్ ఇవ్వడం మినహా మిగతావారు నిస్సహాయులుగా ఉండటం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో గోక్కోవడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed