ఫాంహౌస్ నుంచి సారు బయటకొచ్చేది ఎప్పుడంటే..!

by karthikeya |
ఫాంహౌస్ నుంచి సారు బయటకొచ్చేది ఎప్పుడంటే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్ కేసీఆర్ రాబోతున్నారు. అందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 7తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ మళ్లీ జనం బాటపడతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాదిలో కాంగ్రెస్ వైఫల్యాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎండగట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫాం హౌజ్ వేదికగా రాష్ట్ర పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో కేటీఆర్, హరీష్ రావు పర్యటిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. పార్టీ కేడర్ ను యాక్టీవ్ చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జనాల్లోకి రాలేదు. ఫాం హౌజ్ కే పరిమితం అయ్యారు. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే అసెంబ్లీకి కూడా రావడం లేదని, ప్రజాసమస్యలపై మాట్లాడటం లేదని, ఇబ్బందులు పడుతున్నా స్పందించడం లేదని మండిపడుతున్నారు. వీటికి తోడు రుణమాఫీపై రైతులు నిరసనలు చేపడుతున్నారు. కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో రుణమాపీ సైతం కాలేదు. అయినా కేసీఆర్ మాత్రం ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లకు మార్క్ వేసి కూల్చివేస్తుండటంతో ప్రజలు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిలదీస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్రనష్టం జరిగినా స్పందించలేదు. క్షేత్రస్థాయిలో పర్యటన చేయకపోవడం, ప్రజలకు భరోసా కల్పించకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది పూర్తి అవుతుంది. దీన్ని పురస్కరించుకొని ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయి కార్యచరణ చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలకు హింట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. రైతు, నిరుద్యోగ, ప్రజలు, విద్యార్థి, మహిళా ఇలా వివిధ అంశాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా వైఫల్యాలే ఎజెండాగా ముందుకు వెళ్లాలని అప్పుడే పార్టీ సత్తాచాటుతుందని, మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని నేతలతో కేసీఆర్ పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఫాం హౌజ్ వేదికగా తాజా పరిస్థితులపై ఆరా

ఫాం హౌజ్ లో ఉన్న కేసీఆర్ ను పార్టీ సీనియర్ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు తరచూ భేటీ అవుతున్నారు. రాష్ట్ర రాజకీయ అంశాలను చర్చిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు.? ఉద్యోగ వర్గాలు ఏమనుకుంటున్నాయి... నిరుద్యోగు యువత, విద్యారంగం తదితర అంశాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. పార్టీ క్షేత్రస్థాయిలో ఎలా ఉంది... యాక్టీవ్ గా పనిచేస్తున్న నేతల వివరాలను సైతం తెలుసుకుంటున్నట్లు తెలిసింది. అదే విధంగా రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, ప్రజల వివిధ సమస్యలు, నాయకుల ఫిరాయింపులు, తదితరాల గురించి కేసీఆర్​ చర్చిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఆరా తీస్తూనే నేతలకు తగిన సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. సమస్యల ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజల నుంచి స్పందనను బట్టి ముందుకు వెళ్లాలని అప్పుడే మనం గుర్తింపు వస్తుందని నేతలకు సూచిస్తున్నట్లు సమాచారం.

పార్టీ యాక్టివిటీస్, బలోపేతంపై దృష్టి

పార్టీ బలోపేతం కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేయనున్నట్లు తెలిసింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలు త్వరలోనే వేయనున్నట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేసిన తర్వాత కేడర్ శిక్షణ కార్యక్రమాలతో పాటు స్థానిక సమస్యలపై పోరాటాలకు కార్యచరణ చేపడుతున్నారు. ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారనేది త్వరలోనే కేసీఆర్ వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిత్యం ప్రజల్లో పార్టీ నేతలు ఉండటంతో పాటు వారికి భరోసా కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. ఏయే అంశాలపై ప్రత్యక్ష పోరాటాలు చేస్తారనేది చూడాలి.

క్షేత్రస్థాయిలో కేటీఆర్, హరీశ్‌రావు

ప్రస్తుతం కేటీఆర్, హరీష్ రావు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై గళం వినిపిస్తున్నారు. అయితే డిసెంబర్ లో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారనే ప్రచారంజరుగుతుంది. అప్పటివరకు వీరివురు ప్రజాక్షేత్రంలో యాక్టీవ్ రోల్ పోషించనున్నారు. ఇప్పటికే దసరా తర్వాత ప్రజల మధ్యకు కేసీఆర్ వస్తారనే ప్రచారంజరిగింది. పార్టీ సైతం లీకులు ఇచ్చింది. మళ్లీ డిసెంబర్ లో వస్తారని పార్టీ నేతలకు కేసీఆర్ హింట్ ఇచ్చారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకు అప్పుడైనా వస్తారా? మళ్లీ పోస్టు ఫోన్ చేస్తారా? పార్టీ కమిటీలపై దృష్టిసారిస్తారా? అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగేళ్లు ఉండటంతో ఇప్పటి నుంచి ఎందుకని భావిస్తారా? ఏం చేయబోతున్నారనేది మాత్రం పార్టీలో హాట్ టాఫిక్ గా మారింది. కేసీఆర్ ప్రజల మధ్యలోకి వస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని, కేడర్ పార్టీ మారకుండా అడ్డుకట్ట వేయవచ్చని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్.

Advertisement

Next Story

Most Viewed