మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త..వాల్ పోస్టర్ల కలకలం..

by Aamani |
మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త..వాల్ పోస్టర్ల కలకలం..
X

దిశ, జగిత్యాల/మేడిపల్లి : "మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. మంత్రాలు చేసే వాళ్ళని ఒక్కొక్కరిని చంపబోతున్నాం " అంటూ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కలకలం రేపాయి. మండలంలోని కట్లకుంట గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిలాఫలకానికి మంత్రాలు చేసేవాళ్లను హెచ్చరిస్తూ వాల్ పోస్టర్లు అంటించారు. గ్రామంలోని ఫలానా చోటు నుండి ఇద్దరు వ్యక్తులతో ఈ పని మొదలు పెట్టి మిగతా వాడల్లో ఉన్న మంత్రాలు చేసే వారందరినీ చంపేస్తామంటూ వాల్ పోస్టర్ లో ఎరుపు రంగు అక్షరాలతో రాశారు. మంత్రగాళ్లకు సపోర్ట్ చేసే వారిని కూడా వదిలిపెట్టమని తాము ప్రజల మంచి కోరే సంస్థకు చెందిన వారమంటూ పోస్టర్ లో పేర్కొన్నారు.

ఈ వాల్ పోస్టర్ విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారా లేక ఎవరైనా ఆకతాయిల పనా?అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా సరిగ్గా రెండున్నర ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామంలో ఓ 8 మంది మాంత్రికలను హెచ్చరిస్తూ ఏకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీయగా పోలీసులు సైతం ఈ విషయంపై ఆరా తీశారు. ఆకాశానికి రాకెట్ పంపుతున్న ఆధునిక యుగంలో మంత్రాలు చేతబడులు పూర్తిగా మూఢనమ్మకమని ఇలాంటి సున్నితమైన విషయాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అతిగా రియాక్ట్ కాకూడదని విజ్ఞాన వేదిక సభ్యులు చెబుతున్నారు.

Next Story

Most Viewed