Collector Sandeep Kumar Jha : విద్యార్థులతో నిత్యం సాధన చేయించాలి

by Aamani |
Collector Sandeep Kumar Jha : విద్యార్థులతో నిత్యం సాధన చేయించాలి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పాఠశాలల్లో ఆయా సబ్జెక్టులలోని పాఠ్యాంశాలపై విద్యార్థులతో నిత్యం సాధన చేయించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అక్కపల్లి లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యాలయాల ఆవరణ, టీచర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. కట్టెల పొయ్యి పై ఆహార పదార్థాలను తయారు చేయవద్దని నిర్వాహకులకు సూచించారు. వెంటనే సిలిండర్, గ్యాస్ సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు మ్యాథ్స్, ఇతర పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, విద్యార్థులందరూ అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా తీర్చిదిద్దాలని, చదవడం, రాయడం, ప్రశ్నించే సామర్థ్యం వచ్చేలా సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా బోధించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, తహసీల్దార్ రాం చంద్రం, ఎంపీడీఓ సత్తయ్య, ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Next Story