కేసుల్లో శిక్షల శాతం పెంచాలి

by Sridhar Babu |
కేసుల్లో శిక్షల శాతం పెంచాలి
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులకు సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదు స్వీకరణ నుంచి కేసు నమోదు, చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేసి కోర్టులలో నిందితులకు శిక్షలు పడే విధంగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. పెండింగ్ కేసులపై పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవతో పురోగతి సాధిస్తూ కేసులను త్వరగా పరిష్కరించాలని, నేరాలను తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారీచేసిన నాన్​ బెయిలబుల్​ వారెంట్లను నిందితులపై అమలు పరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.

జిల్లాలో హిస్టరీ, రౌడీ షీటర్స్, గ్రామాల్లో, పట్టణాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠినంగా వ్యహరించాలన్నారు. నేర పరిశోధనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, గంజాయి, గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట, గుడుంబా, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.

మీకోసం ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ రూల్స్, సైబర్ నేరాలు, షీ టీమ్, చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్టంగా అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సాహకాలు అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఆర్ఐ లు యదగిరి, మధుకర్, రమేష్, ఎస్ఐ లు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story