Collector Sandeep Kumar Jha : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి

by Sridhar Babu |
Collector Sandeep Kumar Jha : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి
X

దిశ, వేములవాడ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పొరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్ ఆర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులను, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు

మెరుగైన విద్యా బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో అన్ని వసతులు, సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఏ తరగతిలో ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆరా తీశారు. కిచెన్, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed