Godavari : పొంగుతున్న గోదావరి...

by Sumithra |
Godavari : పొంగుతున్న గోదావరి...
X

దిశ, వెల్గటూర్ : ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు నిర్మల్ జిల్లాల్లోని కడెం పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదికి అంతకంతకు వరద పోటెత్తుతుందని గోదావరి పరివాహక ప్రాంతంలోని లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్గటూర్ తహశీల్దార్ శేఖర్ గురువారం హెచ్చరించారు. దిశతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇప్పటికే కడెం ప్రాజెక్ట్ నీటి నిలువ కేపాసిటీ పూర్తి అయింది. గత ఏడాది వరద బీభత్సం వల్ల కలిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తుగానే మూడు గేట్లు ఎత్తి వరద నీటిని కిందకు గోదావరిలోకి వదిలేస్తున్నారు. పలితంగా గోదావరి నిండు కుండలా మారింది. ఎడ తెరిపి లేని వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల మరో రెండు రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరగా చేరుకుంటుంది.

ఈ క్రమంలో ఎల్లంపల్లి అయకట్టు పరివాక ప్రాంతంలోని వాగులు వంకల్లోకి ఇప్పటికే పెద్దమొత్తంలో బ్యాక్ వాటర్ చేరుకుంది. పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే విధంగా నదీ ప్రవాహం ఉదృతంగా ఉన్నందున జాలరులు చేపల వేటకు వెళ్ళద్దని తహశీల్దార్ హెచ్చరించారు. కోటిలింగాలకు గోదావరి పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు మెట్లపైనే స్నానాలు చేయాలని నది లోనికి వెళ్లద్దని సూచించారు. భక్తులు ప్రమాదం బారిన పడకుండా స్నాన ఘట్టాలవద్ద బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని తహసీల్దార్ శేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



Next Story