అర్హులైన రైతులందరికీ రుణమాఫీ: మంత్రి పొన్నం ప్రభాకర్

by Nagam Mallesh |
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ: మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, వేములవాడః అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం వేములవాడ పర్యటనకు వచ్చిన మంత్రి ముందుగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ వేములవాడ లో 300 మెట్రిక్ టన్నుల గోదాం, ప్యాక్స్ ఆన్లైన్ సర్వీస్ డిజిటల్ సేవా కామన్ సర్వీస్ సెంటర్ ను, ది కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ లి. వేములవాడ శాఖ నూతన భవనాన్ని, బ్యాంక్ ఏటిఎంను విప్ ఆది శ్రీనివాస్, నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. సహకార బ్యాంక్ నుండి విద్యా లోన్, గృహ లోన్, స్వయం ఉపాధి లోన్ చెక్కులు మంత్రి, విప్ పంపిణీ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటి దశలో లక్ష, రెండో దశ లక్ష 50 వేలు, మూడో దశలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్నారు.

2018 డిసెంబర్ 12 ముందు లోన్ తీసుకొని బకాయిలు ఉన్నవారు, 2023 డిసెంబర్ 9 తరువాత తీసుకున్న వారికి లోన్ మాఫీ కాలేదని స్పష్టం చేశారు. 265 రోజుల్లో 85 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, 2500 కోట్ల రూపాయలు విలువైన ఉచిత టికెట్లపై ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. వేములవాడ, కొండగట్టు, ఇతర ఆలయాలకు పోవాలన్న బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని వివరించారు. యావత్ తెలంగాణ లో 70 శాతానికి పైగా మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారని తెలిపారు. రూ. 500 కి గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి ప్రజా పాలనలో భాగంగా ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తులు స్వీకరిస్తామని.. నూతన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం 31 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టారని, ఇప్పటికే 18 వేల కోట్లు రుణ మాఫీ పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అర్బన్ తాసిల్దార్ మహేష్ కుమార్, వేములవాడ పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, ఆయా సంఘాల చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story