కాళేశ్వరం విచారణ స్పీడప్.. నిపుణుల కమిటీతో జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమావేశం

by Prasad Jukanti |
కాళేశ్వరం విచారణ స్పీడప్.. నిపుణుల కమిటీతో  జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ స్పీడప్ చేసింది. గత రెండు రోజులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ బాధ్యతలు చూసిన ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించిన కమిషన్.. గురువారం నిపుణుల కమిటీతో సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జేఎన్టీయూ ప్రొఫెసర్ సీబీ కామేశ్వరరావు ఛైర్మన్‌గా ఏర్పాటైన కమిటీలో విశ్రాంత సీఈ సత్యనారాయణ, వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా ఈఎన్సీ అనిల్‌కుమార్ కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. బ్యారేజీలో తలెత్తిన సమస్యలు, వాటికి గల కారణాలపై అధ్యయనం చేసింది.

ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న సమావేశంలో తమ పరిశీలనలో గుర్తించిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు వివరించనున్నారు. మరోవైపు కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ వరకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. కానీ ఎన్నికల కోడ్ వంటి కారణాలతో విచారణ ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో బ్యారేజీల విషయంలో ఇప్పటికే పలువురితో సమావేశమైన వివరాలు సేకరించిన కమిషన్.. మరికొంత మంది వద్ద వివరాలు ఆరా తీయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గడువు పెంచినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed