Jupally Krishna Rao: కేసీఆర్.. మిమ్మల్ని చెండాడే మమ్మల్ని కూర్చోబెట్టారు.. జూపల్లి కౌంటర్

by Prasad Jukanti |
Jupally Krishna Rao: కేసీఆర్.. మిమ్మల్ని చెండాడే మమ్మల్ని కూర్చోబెట్టారు.. జూపల్లి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చీల్చిచెండాడుతామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ నిర్వాహకం చూసే ప్రజలు మిమ్మల్ని చెడాడి మాకు అధికారం ఇచ్చారని సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని, వాస్తవిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడాన్ని జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నా కంటే చిన్న వయసు వారైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎదుట నేను కూర్చోవాలా అనే దుగ్ధతోనే కేసీఆర్ సభకు రావడం లేదని ఫైర్ అయ్యారు. విలువలను కాలరాస్తూ ఇప్పటికీ బుద్ధితెచ్చుకోకుండా ఇంకా పొడుస్తా, నరుకుతా అనే మాటలు సరికావన్నారు. ఏ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రివి అయ్యావో అదే అసెంబ్లీకి రాకపోడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కాదా? మీకు అంత గర్వమా? మీది పొగరుబోతు తనం కాదా? అని ఘాటు విమర్శలు చేశారు. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని చులకన భావంతో చూడటం సరికాదన్నారు.

మీరు ఆపని చేసి ఉంటే రాష్ట్రం ఎక్కడో ఉండేది:

గడిచిన పదేళ్లు మీ ప్రభుత్వంలో తుగ్లక్ పాలన కాకుండా బాధ్యతయుతంగా సాగించి ఉంటే ఇవాళ తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడో ఉండేదని జూపల్లి అన్నారు. ఈ హయాంలో ఇటువంటి పనులు చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సంక్షేమానికి, సాగునీటికి నిధులు ఇవ్వలేదని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవీకత బడ్జెట్ అన్నారు. ఒక్క రూపాయికి కూడా అదనంగా ప్రజలపై పన్నుల భారం మోపలేదని చెప్పారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని, బడ్జెట్ లో వ్యవసాయానికి 25 శాతం కేటాయించామన్నారు. 17 శాతం నిధులు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కిందే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. కేవలం ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకోవడానికే దళితబంధు తీసుకువచ్చిన మీరు దళిత బంధు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయంకు బడ్జెట్ లో కేటాయించామన్నారు.రైతులు పండింటిన ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు.

ఏ విషయంలో నిష్ణాతుడని రాజ్యసభ ఇచ్చారు?

మీ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని గతంలో మీరు అనుకున్నారు. ఏ విషయంలో నిష్ణాతులని నీ కుటుంబ సభ్యులకు రాజ్యసభ అవకాశం కల్పించారు? అని జూపల్లి ప్రశ్నించారు. బడ్జెట్ లో వాస్తవాలు ఉంటే గాలిమాటలు మాట్లాడుతూ బడ్జెట్ అంతా ట్రాష్, గ్యాస్ అని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా చాలా చేయాలని ఉన్నా కేసీఆర్ నిర్వాకం వల్ల కుదరడం లేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్, ఆయన కుమారుడు, అల్లుడు మాటలు చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. ఏడు నెలలకే 30 వేల కోట్ల అప్పులు తెచ్చామని మాట్లాడుతున్నారు. మము తెచ్చిన అప్పుల్లో మీరు గతంలో చేసిన అప్పులు కట్టేందుకే సుమారు రూ.40 వేల కోట్లు అయిందన్నారు.



Next Story