Ponguleti : ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు : పొంగులేటి

by Y. Venkata Narasimha Reddy |
Ponguleti : ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు : పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్: కూడు గూడు గుడ్డ ... గరీబీ హటావో నినాదంతో ఇందిరమ్మ పేదల గుండెల్లో కొలువైందని, అట్లాంటి ఇందిరమ్మ పాలన(Indira Gandhi's Rule)లో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)అన్నారు. ఆదివారం నాడు మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ, క్యాలండర్ ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు వచ్చే నాలుగు సంవ‌త్సరాల‌లో ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. పేద‌ల‌కు ఇండ్లు నిర్మించే హౌసింగ్ శాఖ‌ను గ‌త ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఆ విభాగాన్ని మూసివేసి ఉన్న ఉద్యోగుల‌ను ఇత‌ర శాఖ‌ల‌లో విలీనం చేసిందని విమర్శించారు.

ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తూ ఈ శాఖ‌ను పునరుద్ధరించి ల‌బ్దిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం, ప‌ర్యవేక్షణ వ‌ర‌కు అవ‌స‌ర‌మైన యంత్రాంగాన్ని స‌మ‌కూర్చుకుందని అన్నారు. 326 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పే దవారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆరు గారెంటీలు పథకాలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లక్షలాది మంది నీడలేని పేదలకు ఐదు లక్షల రూపాయల స్కీమ్ తో పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అని దానికి గృహనిర్మాణ సంస్థ సిబ్బంది పూర్తిగా సహకరించాలని, మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొగ్గుల వెంకట రామిరెడ్డి, సీనియర్ నాయకులు కంది రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story