CM Revanth reddy: మా డిమాండ్ నెరవేర్చితే మోడీ లక్ష్య సాధనకు మా సంపూర్ణ సహకారం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
CM Revanth reddy: మా డిమాండ్ నెరవేర్చితే మోడీ లక్ష్య సాధనకు మా సంపూర్ణ సహకారం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ భారీ రుణభారం తెలంగాణకు సవాల్‌గా మారిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఇవాళ ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశమైంది. చైర్మన్ అరవింద్ పనగారియా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని దీంతో రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

అలా అయితే మోడీకి సహకరిస్తాం..

గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణ భారం రూ. 6.85 లక్షల కోట్లకు చేరుకుంటే ఇందులో బడ్జెట్ రుణాలతోపాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని, లేదా అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు తగినంత సహాయం అందిస్తే దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నేరవేరుస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాలని కోరారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చితే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని, తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

సెంట్రల్ స్కీమ్స్‌ కఠిన నిబంధనతో ఇబ్బందులు : భట్టి

సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. కేంద్ర పథకాల కఠిన నిబంధనల కారణంగా వాటి ప్రయోజనాలు పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలు కనుగుణంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్‌లను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలన్నారు. సెస్‌లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నదన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందన్నారు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని భట్టి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed