GHMC: ఫస్ట్ టైమ్ బడ్జెట్‌లో బల్దియాకు ఊరట.. రూ.3,065 కోట్ల నిధులు కేటాయింపు

by Shiva |
GHMC: ఫస్ట్ టైమ్ బడ్జెట్‌లో బల్దియాకు ఊరట.. రూ.3,065 కోట్ల నిధులు కేటాయింపు
X

దిశ, సిటీ బ్యూరో : నూతన ఆర్థిక సంవత్సరం( 2024-25)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహానగరానికి పెద్ద పీట వేసిందనే చెప్పవచ్చు. సమైక్య, ప్రత్యేక పాలనలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు జీహెచ్ఎంసీకి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యమిస్తూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి రూ.3065 కేటాయింపులు జరిపి ఊరట కలిగించింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీకి రూ.5వేల కోట్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే.

జీహెచ్ఎంసీ కోరిన రూ.5 వేలకు చేరువగా రూ.3065 కేటాయించటంతో పాటు హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకంగా మౌలిక వసతుల మెరుగునకు ఏకంగా రూ.10వేల కోట్లను కేటాయించటం జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోటిన్నర మంది జనాభాకు అవసరమైన, అత్యవసరమైన సేవలందించే జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఔటర్ వెలుపల ఉన్న ప్రాంతాలను, స్థానిక సంస్థలను కలుపుతూ ఇటీవలే ఏర్పాటైన హైడ్రాకు సైతం రూ.200 కోట్ల నిధులు కేటాయించింది. కొత్త బడ్జెట్ లో జలమండలి రూ.5600 కోట్లు, హెచ్ఎండీఏ రూ.2 వేల కోట్ల ప్రతిపాదనలు సర్కారుకు పంపగా, జలమండలికి రూ.3385 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.500 కోట్లను కేటాయించింది. దీనికి తోడు హైడ్రా, ఎయిర్ పోర్టు మెట్రో, పాతబస్తీ మెట్రో, హైదరాబాద్ మెట్రో రైలుకు సైతం వేర్వేరుగా నిధులను కేటాయించింది.

---------------------------------------------------------------

ఆర్థిక సంవత్సరం బల్దియా ప్రతిపాదనలు సర్కారు కేటాయింపులు

---------------------------------------------------------------

2023-24 రూ.3 వేల కోట్లు రూ.31.10 కోట్లు

2024-25 రూ.5 వేల కోట్లు రూ.3065 కోట్లు

---------------------------------------------------------------

జల మండలికి కేటాయింపులు

--------------------------------------------------------------

2023-24 రూ.5600 కోట్లు రూ.1960.17 కోట్లు

2024-25 రూ.5800 కోట్లు రూ.3385 కోట్లు

--------------------------------------------------------------

హెచ్ఎండీఏ

--------------------------------------------------------------

2023-24 రూ.2 వేల కోట్లు రూ.1500 కోట్లు

2024-25 రూ.2200 కోట్లు రూ. 500 కోట్లు

---------------------------------------------------------------

మెట్రో రైల్‌కు తగ్గని ప్రాధాన్యత

ఈ సారి రాష్ట్ర బడ్జెట్ లోనూ మెట్రోరైలుకు ప్రాధాన్యమేమీ తగ్గలేదనే చెప్పవచ్చు. 2022-23 బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రో రైలుకు రూ. 2377.35 కోట్లు కేటాయించిన సర్కారు గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మెట్రోకు మూడు హెడ్లుగా రూ. 2వేల కోట్లు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాజా బడ్జెట్ లో పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు, ఏయిర్ పోర్డు మెట్రోకు రూ.100 కోట్లను కేటాయించిన సర్కారు హైదరాబాద్ మెట్రో రైలుకు కేటాయించిన రూ.500 కోట్లతో కలుపుకుని ఈ సారి మొత్తం మెట్రోకు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గకుండా మూడు హెడ్లుగా రూ.1100 కోట్లను కేటాయించింది.



Next Story