హైదరాబాద్ జిల్లాలో 5 లక్షలకు పైగా బోగస్ ఓట్ల తొలగింపు

by Disha Web Desk 15 |
హైదరాబాద్ జిల్లాలో 5 లక్షలకు పైగా బోగస్ ఓట్ల తొలగింపు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : బోగస్ ఓట్ల తొలగింపుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేయని వారు , ఇండ్లు మారినవారు, చనిపోయిన వారిని గుర్తించి వారి ఓట్లను జాబితా నుండి తొలగించారు. 2023 జనవరి నెల నుండి హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,41,259 మంది పేర్లను జాబితా నుండి తొలగించారు. వీరిలో 47,141 మంది మరణించారని, 4,39,801 మంది ఇళ్లు మారారని , 54,259 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఎన్నికల అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో కలిపి సుమారు 45.7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.

ఇది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సుమారు 33 వేలకు పైగా అధికంగా ఉంది. అయితే ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారులు పోలింగ్ కు హాజరుకాని ఇండ్లపై ప్రత్యేక దృష్టి సారించి కొన్నింటిని బోగస్ ఓట్లుగా గుర్తించారు. ఇవే కాకుండా మృతి చెందిన వారు, ఇండ్లు మారిన వారు మొత్తం కలిపి 1,09,117 ఓట్లు తొలగించారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా సగటు ఓటర్ల జనాభా నిష్పత్తి 68 శాతంగా ఉండగా హైదరాబాద్ జిల్లాలో ఇది 75.3 శాతంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లక్షకు పైగా ఓట్లు తొలగించకుండా ఉంటే ఇది మరింత అధికంగా ఉండేది. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన

స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఫారం 7 , ఫారం 8ని సేకరించే విధానం ప్రకారం అన్ని తొలగింపులు జరిగాయని అధికారులు తెలిపారు. ఇంకా ఓటర్ల జాబితాల ప్రక్షాళన సమయంలో చాలా మంది ఓటర్ల జాబితాలపై ప్రామాణికం కాని ఇంటి నంబర్ ఉన్నట్లు గమనించారు. దీంతో అటువంటి ఓటర్లను గుర్తించి సవరణలు చేయడానికి డ్రైవ్‌ను చేపట్టారు. దీని ప్రకారం మొత్తం 1,81,405 మంది ఓటర్లు నాన్‌స్టాండర్డ్ ఇంటి నంబర్లను గుర్తించి వారి ఇంటి నంబర్లలో అధికారులు సవరణలు చేశారు.

ఎంఐఎంపై ప్రభావం...

హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో 7 అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం చేతిలో ఉన్నాయి. ఇవే కాకుండా మరో మూడు నుండి నాలుగు నియోజకవర్గాలలో మైనార్టీల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలైన ఫెరోజ్ ఖాన్ బోగస్ ఓట్ల తొలగింపు యుద్ధం మొదలు పెట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు బోగస్ ఓట్లను తొలగించాలని ఫిర్యాదు చేశారు. చివరకు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు.

అలాగే హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత సైతం పాతబస్తీలో బోగస్ ఓట్లను తొలగించాలని ఫిర్యాదులు చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఇతర అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి బోగస్ ఓట్ల ఏరివేతకు చర్యలు తీసుకుంది. ఇలా తొలగించిన ఓట్లలో అధిక శాతం ఎంఐఎం ప్రభావిత ప్రాంతాలలో ఉండడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు వినబడుతున్నాయి.

నాంపల్లి నియోజకవర్గంలో అధికం...

బోగస్ ఓట్ల తొలగింపు ప్రభావం నాంపల్లి నియోజకవర్గంలో అధికంగా ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 21,407 బోగస్ ఓట్లను గుర్తించారు. తొలగించిన వారిలో 15,963 మంది ఇండ్లు మారగా 2,843 మంది చనిపోయారు. 2,601 డూప్లికేట్ ఓటర్లు ఉండడంతో వారిని జాబితా నుండి తొలగించారు. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 21,222 ఓట్లను అధికారులు తొలగించారు. వీటిలో 16,658 మంది షిప్ట్ అయిన వారు కాగా 3,754 బోగస్ ఓటర్లు, 810 మంది చనిపోయిన వారు ఉన్నారు.

ఇక కార్వాన్ నియోజకవర్గంలో 20,722 మంది ఓట్లను తొలగించారు. వీరిలో 12,527 మంది ఇండ్లు మారగా 4,827 మంది బోగస్ ఓటర్లు ఉన్నారు. మరో 3,358 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించి వారిని జాబితా నుండి తొలగించారు. ఇవే కాకుండా పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణ్ గుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా పరిధిలో బోగస్ ఓట్లను అధికారులు పెద్ద మొత్తంలో తొలగించడంతో దీని ప్రభావం ఫలితాలపై చూపే అవకాశం ఉంది.



Next Story

Most Viewed