Harish Rao : ఇదేనా చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం? : హరీష్ రావు

by M.Rajitha |
Harish Rao : ఇదేనా చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం? : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrbabau) వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు. మంగళవారం ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివి అని, సమన్యాయం కోరుకుంటున్నాను అనడం హాస్యాస్పదం అన్నారు. అదే నిజమైతే నాగార్జున సాగర్(Nagarjuna Sagar) ఎడమ కాలువ ఎండబెట్టి, కుడి కాలువ నిండుగా నీళ్ళు తీసుకువెళ్లడం సమంజసమేనా, సమన్యాయమేనా? అని ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండలో నీళ్ళు లేక పంటలు ఎండుతున్నాయని ఆ పాపం రేవంత్ రెడ్డి, ఆయన గురువు చంద్రబాబుది అని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కృష్ణా జలాల్లో(Krishna Water) ఏపీ 512 టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవాల్సింది, ఇప్పటికే 657 టీఎంసీల నీరు వాడుకుంటున్నారని... తెలంగాణకు 343 టీఎంసీలు రావాల్సింది, 220 టీఎంసీలు మాత్రమే వచ్చిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు తెలంగాణ అన్యాయం చేశారని... రేపటి రోజున తెలంగాణలో తాగునీటికి, సాగునీటికి తీవ్ర కరువు ఏర్పడనుందని ఇది సమన్యాయం ఎలా అవుతుందని మండిపడ్డారు. గోదావరి బంకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై మాట్లాడుతూ.. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నామని అంటున్నారని, నిజానికి గోదావరి నీటిని పెన్నాకు తీసుకువెళ్లాడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. బచావత్ ట్రిబ్యునల్(Bachawath Tribunal) ప్రకారం తెలంగాణకు గోదావరి జలాల్లో(Godavari Water) 968 టీఎంసీలు రావాల్సి ఉండగా.. వాస్తవానికి ఎన్నడు కూడా 200 టీఎంసీల నీటిని కూడా ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర నాయకులు ఇవ్వలేదని అన్నారు. అందుకే 240 టీఎంసీల నీటికోసం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)ను కెసిఆర్(KCR) సాధించారని.. ప్రస్తుతం కాంగ్రెస్ నిర్లక్ష్యం వలన గోదావరిపై ఇంకా నిర్మించాల్సిన ప్రాజెక్టుల డీపీఆర్ లు వెనక్కి వస్తున్నాయని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా అయితే మనకు దక్కాల్సిన నీటిని పొరుగు రాష్ట్రాలు దోచుకుపోతాయని తెలిపారు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేయత్నం చేయలేదని అన్నారని, కానీ వాస్తవానికి 13-06- 2018 రోజున ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రానికి కాళేశ్వరంకు వ్యతిరేకంగా లేఖ రాశారని గుర్తు చేశారు. కాళేశ్వరం అనుమతులు రద్దు చేయాలని, ఆ ప్రాజెక్టు పనులు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన విషయం మీడియాకు తెలియ జేశారు. చంద్రబాబు దత్తత తీసుకున్న జిల్లాల్లో పాలమూరు ప్రాజెక్టు, దిండి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను కూడా చంద్రబాబు వ్యతిరేకిస్తూ లేఖలు రాసిన విషయం బయటపెట్టారు. ఆయన నిజంగా రెండుకళ్ల సిద్ధాంతం, సమన్యాయం కోరుకుంటే వెంటనే తెలంగాణలోని ప్రాజెక్టులపై నో అబ్జెక్షన్ లెటర్ కేంద్రానికి రాయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Next Story