శాసన మండలి మనుగడకే ప్రమాదం.. మాజీ MP వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
శాసన మండలి మనుగడకే ప్రమాదం.. మాజీ MP వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం ఏర్పడిందని, పూర్తిగా రద్దు అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్171 ప్రకారం శాసన మండలిలో సీట్లు 40కంటే తక్కువ ఉండకూడదని, శాసన సభ సీట్లలో 1/3 వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలన్నారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించడం వల్ల అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 119కి తగ్గిందని, గత అసెంబ్లీ టర్మ్‌ ముగిసే వరకు అంగ్లో ఇండియన్‌ పదవీ కాలం ఉందని, దీంతో గత అసెంబ్లీ సమయం ముగిసే వరకు ఎలాంటి ముప్పు రాలేదన్నారు. కానీ కేంద్రం చేసిన రాజ్యంగ సవరణ కొత్త అసెంబ్లీ నుంచి అమల్లోకి వచ్చిందని, ఇప్పుడు ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడు అసెంబ్లీలో లేరని దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 119 మాత్రేనని, దాని ప్రకారం రాజ్యాంగ నిబంధనలు 1/3 కౌన్సిల్‌ సభ్యుల సంఖ్య 39కి పడిపోయిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కనీసం 40 మంది సభ్యులు ఉండాలనే నిబంధన ఉల్లఘించినట్లు అవుతుందన్నారు. దీనిపై ఎవరైనా కోర్టు వెళితే వెంటనే మండలి రద్దు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

తెలంగాణ శాసన మండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలని, చంద్రబాబు పస్తుతం కేంద్రంలో కీలకంగా ఉన్నారని, శనివారం ఇద్దరు సీఎంలు కలిసి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు కృషి చేయాలని సూచించారు. విభజన చట్టం 26 సెక్షన్‌ ప్రకారం తెలంగాణలో 153కు, ఏపీలో 225కు అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉందన్నారు. గతంలో అసెంబ్లీ సీట్లను పునర్విభజన చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదని, కుంటి సాకులు చూపిందని ఆరోపించారు. కానీ జమ్ము కశ్మీర్‌‌లో అసెంబ్లీ సీట్లను పెంచుకున్నారని, కేంద్రానికి ఇష్టం ఉంటే సీట్లను పెంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుతో మాట్లాడి విభజన చట్టంలో పేర్కొన్న విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే విధంగా సీఎం రేవంత్‌ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. మండలి కొనసాగే లా చూడాలని కోరారు.

Next Story

Most Viewed