ఎట్టి పరిస్థితుల్లో ఆ పథకం ఆపడానికి వీల్లేదు.. ప్రభుత్వానికి జగదీష్ రెడ్డి కీలక డిమాండ్

by Satheesh |   ( Updated:2024-06-23 10:40:41.0  )
ఎట్టి పరిస్థితుల్లో ఆ పథకం ఆపడానికి వీల్లేదు.. ప్రభుత్వానికి జగదీష్ రెడ్డి కీలక డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు పెట్టుబడి సాయం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు సాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీలులేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. రైతు భరోసా పేరుతో రైతులకు రూ.15,000 ఇస్తామని మాట తప్పారని ఫైర్ అయ్యారు. రైతు భరోసా స్కీమ్‌పై క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారని, క్యాబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. క్యాబినెట్ సబ్ కమిటీ రైతులను మోసం చేయడానికి వేసిన కమిటీ అని అన్నారు.

రైతు ఋణమాఫీతో సంబంధం లేకుండా రైతు బంధు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు. పింఛన్ల పెంపు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరే మెదపడం లేదని, విద్యుత్ బిల్లుల మాఫీ రాష్ట్రంలో అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండన్నారు. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరు లోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు వచ్చేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉందా లేదా అనేది అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోను శాంతిభద్రతలు బాగోలేవని, ప్రభుత్వం మాత్రం లీకేజీలు తప్ప ఒక్క హామీ నేరవేర్చలేదని దుయ్యబట్టారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుపుతోన్న విద్యుత్ కమీషన్ నుండి నాకు లెటర్ వచ్చిందని తెలిపారు. లేఖ ఇచ్చిన వారం రోజుల్లో కమీషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని చెప్పారు. విద్యుత్ కమీషన్‌కు నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తానని, కమీషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, విద్యుత్ అధికారుల నుండి కమీషన్ సమాచారం తీసుకోవాలని సూచించారు.

ఈఆర్సీపై ఎన్‌జీటీ స్టే ఇచ్చింది. ఎన్జీటిని విచారణకు పిలుస్తారా అని ప్రశ్నించారు. పర్యావరణ అనుమతులు ఇచ్చిన వారిని విచారణకు పిలుస్తారా అని నిలదీశారు. అందరిని విచారణకు పిలువకపోతే సమగ్ర విచారణ కిందకు రాదని అన్నారు. కమీషన్ చైర్మన్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడిన తర్వాత ఆరు వేల కోట్ల నష్టం జరిగినట్లు సమాచారాన్ని ప్రజలకు తెలిపారు. సమాచారాన్ని తెలిపిన వారిని కమీషన్ చైర్మన్ విచారణకు పిలవాలని కోరారు. కమీషన్ ఏర్పాటు చేసి లీకులు ఇస్తే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లేనని అన్నారు. మేము లేవనెత్తిన అంశాలపై కమిషన్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కమీషన్ చైర్మన్ బాధ్యతగా తప్పుకోవాలని కోరుతానని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story