Davos: దావోస్ వేదికగా తెలంగాణ చరిత్రలోనే భారీ పెట్టుబడి! అమెజాన్‌తో కీలక ఒప్పందం

by Ramesh N |   ( Updated:2025-01-23 08:21:15.0  )
Davos: దావోస్ వేదికగా తెలంగాణ చరిత్రలోనే భారీ పెట్టుబడి! అమెజాన్‌తో కీలక ఒప్పందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దావోస్ (Davos) వేదికపై తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ రూ.60 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో తెలంగాణ చరిత్రలోనే భారీ పెట్టుబడి రేవంత్ రెడ్డి ఘనత సాధించారు. (World Economic Forum) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి శ్రీధర్బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. దాదాపు రూ. 60 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది.

భవిష్యత్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది. ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది.

అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని తెలిపారు. ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Next Story