Congress: మీనాక్షి నటరాజన్ సరికొత్త స్ట్రాటజీ.. హస్తంలో త్రిముఖ వ్యూహం

by Shiva |   ( Updated:2025-03-06 02:29:29.0  )
Congress: మీనాక్షి నటరాజన్ సరికొత్త స్ట్రాటజీ.. హస్తంలో త్రిముఖ వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో పదవుల పందేరానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసేందుకు పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలి. ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దానిపై క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారికి, పార్టీ వెంటే ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పార్టీ నాయకులను మూడు కేటగిరీలుగా విభజించారు. దీనికి అనుగుణంగా కసరత్తు చేయనున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వాళ్లు ఒక గ్రూప్, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారంతా మరో గ్రూప్, కాంగ్రెస్​పవర్‌లోకి వచ్చాక పార్టీలో చేరిన వారిది ఇంకో గ్రూప్‌గా విభజించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఈ విషయంలో​తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే వరుస భేటీలు, సమీక్షలు నిర్వహిస్తున్న నటరాజన్..​పార్టీ, ప్రభుత్వం మధ్య ఉన్న అంతరాలను తొలగించాలని భావిస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహార రచన చేస్తున్నారు. కొంతకాలంగా పార్టీకి తలనొప్పిగా మారిన నేతల సమస్యలకు చెక్​పెట్టేందుకు సరికొత్త ప్లాన్స్​అమలు చేయాలని చూస్తున్నారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో దీనిపై మీనాక్షి ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

మూడు కేటగిరీలుగా విభజన..

రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్​అధికారంలో వచ్చింది. నియోజకవర్గాల్లో ఇదివరకే ఉన్న లీడర్లతో పాటు అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక మంది పార్టీలో చేరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక, లోక్‌సభ ఎన్నికలకు ముందు సైతం ఇతర పార్టీల నేతలు కొందరు హస్తం పార్టీలో చేరారు. అయినప్పటికీ కొన్ని సెగ్మెంట్లలో కొత్త పాత నేతల మధ్య అంతరాలు కొనసాగుతున్నాయి. అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి వాటికి ఈ కేటగిరీల ద్వారా స్వస్తి పలకవచ్చని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. తద్వారా పార్టీలో పనిచేసే వారికి న్యాయం జరిగే అస్కారం ఉందని, కొత్త వచ్చిన వారికి పదవులు ఇచ్చారనే అపవాదు లేకుండా ఉంటుందని అంచనా వేసినట్లు సమాచారం.

పోస్టులు తక్కువ.. ఆశావహులు ఎక్కువ..

నామినేటెడ్​పోస్టులు తక్కువగా ఉండి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక నాయకులకు తలనొప్పిగా మారింది. దీంతో కేటగిరీల వారీగా ఎంపిక ఫలితాలను ఇస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. నామినేటెడ్​పోస్టుల కోసం సెగ్మెంట్‌కు ఇద్దరి పేర్లను సేకరించాలని పీసీసీ అధ్యక్షుడికి మీనాక్షి నటరాజన్​సూచించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు ఒక గ్రూప్, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఒక గ్రూప్, పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన వారంతా ఒక గ్రూప్‌గా విభజించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్చి ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ ఫార్ములా ప్రకారమే పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టాలని చూస్తున్నారు. పైన చెప్పిన 3 కేటగిరీల్లోనూ సామాజికవర్గాలు, మహిళలు, జిల్లాలు, ప్రాంతాల వారీగా పోస్టులను డివైడ్ చేసి భర్తీ చేస్తారని సమాచారం.

Advertisement
Next Story

Most Viewed