సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ ఎఫెక్ట్: రాష్ట్రంలో భారీ మార్పులు జరిగే అవకాశం

by Gantepaka Srikanth |
సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ ఎఫెక్ట్: రాష్ట్రంలో భారీ మార్పులు జరిగే అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. రాహుల్‌గాంధీ పిలుపు మేరకు వెళ్ళడంతో పీసీసీ చీఫ్ నియామకంపై చర్చించే అవకాశమున్నది. సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే తదితరులు కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై చర్చించి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నారు. బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఎలాగూ మంగళవారం సాయంత్రం వరకు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉంటున్నందున కేబినెట్ విస్తరణపైనా చర్చలు జరిగే అవకాశమున్నది. కానీ బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేల చేరిక అంశంపై వేగాన్ని పెంచాలని ఏఐసీసీ నొక్కిచెప్పే అవకాశమున్నందన ప్రస్తుతం నలుగురిని మాత్రమే కేబినెట్‌లోకి తీసుకుని మరో రెండు స్థానాలను ఖాళీగా ఉంచే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ వారంలోనే ఐదారుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల సమాచారం.

ఏఐసీసీ కార్యవర్గంలోనూ భారీ స్థాయి మార్పులు చేయాలనే ఆలోచనలు ఉన్నందున రాష్ట్రం నుంచి జాతీయ అధికార ప్రతినిధిగా ఒకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నది. దీనిపై సీఎం రేవంత్‌తో మాట్లాడి ఎవరిని పంపిస్తారనే చర్చలు జరగనున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న సునీతారావ్ పదవీకాలం పూర్తికావడంతో కొత్త ప్రెసిడెంట్‌ను నియమించడంపై చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతానికి సరితా తిరుపతయ్య పేరు వినిపిస్తున్నా ఈ సమావేశంలో చర్చల అనంతరం పేరు ఫైనల్ కానున్నది.

నేడు ఫాక్స్ కాన్ చైర్మన్‌‌తో భేటీ :

రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృతంగా ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ యంగ్ లియూతో సోమవారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. . ఈ భేటీలోనే ఫాక్స్ కాన్, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహానా ఒప్పందం కుదరనున్నది. పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆ కంపెనీ యూనిట్ స్థాపన కోసం 200 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ యూనిట్ ద్వారా దాదాపు 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించవచ్చని తెలిసింది. దాదాపు 400 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడితో సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ (ఓఎస్ఏటీ)ను ఫాక్స్ కాన్ నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నది. గతంలోనే హెచ్‌సీఎల్ కంపెనీ భాగస్వామ్యంతో సెమీ కండక్టర్, చిప్ ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పడంపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది.

గతేడాది కొంగరకలాన్‌లో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఐ-ఫోన్లకు ఉపయోగపడే ఎయిర్ పాడ్స్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత గతేడాది నవంబరులో ఫాక్స్ కాన్ కంపెనీకి చెందిన 18 మంది ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి డిస్‌ప్లే ఫ్యాబ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపనపై అధ్యయనం చేసింది. దీనికి కొనసాగింపుగా సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత గతేడాది డిసెంబరు 27న ఫాక్స్ కాన్ ఇండియా హెడ్ విన్సెంట్ లీ వ్యక్తిగతంగా కలిసి ఫ్యూచర్ ప్రాజెక్టులపై చర్చించారు. మొత్తంగా సుమారు లక్ష ఉద్యోగాల కల్పన దిశగా ఫాక్స్ కాన్ హైదరాబాద్‌లో కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

Advertisement

Next Story

Most Viewed