CM Revanth Reddy: ఆ విద్యార్ధిని చదువుకు ప్రజా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది!

by Ramesh Goud |
CM Revanth Reddy: ఆ విద్యార్ధిని చదువుకు ప్రజా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బిడ్డ ఐఐటీ పాట్నాలో సీటు వచ్చినా చేరలేకపోతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, తన చదువుకు కావాల్సిన మొత్తాన్ని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలుపుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. "ఐఐటీకి వెళ్లలేక మేకల కాపరిగా" అంటూ ఓ పత్రికలోని జిల్లా ఎడిషన్ లో వచ్చిన కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆ విద్యార్ధిని చదువుకు అవసరమయ్యే సహాయాన్ని ప్రభుత్వం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబందించి రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నిధులు విడుదల చేశింది. దీనిపై రేవంత్ రెడ్డి.. రాజన్న సిరిసిల్లకు చెందిన మన తెలంగాణ బిడ్డ, బాదావత్ మధులతకు ఐఐటీ పాట్నాలో సీటు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పేదరిక కష్టాలను ఎదుర్కొని, ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు ముందుగా తనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. అలాగే ఏ ఆటంకం లేకుండా ఐఐటీలో తన చదువును కొనసాగించడానికి కావాల్సిన మొత్తాన్ని, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిన్ననే (23 జూలై, 2024) తెలంగాణ ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందని స్పష్టం చేశారు. ఇకముందు కూడా తను ఇలాగే రాణించి, తెలంగాణకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని ఎక్స్ ద్వారా తెలిపారు.



Next Story