భట్టి విక్రమార్క గట్టోడు.. CM రేవంత్ రెడ్డి ప్రశంస

by Disha Web Desk 2 |
భట్టి విక్రమార్క గట్టోడు.. CM రేవంత్ రెడ్డి ప్రశంస
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 1969లో ఖమ్మం జిల్లా ప్రజలు ప్రారంభించిన ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ కల సాకారం అయిందని తెలిపారు. నక్కజిత్తుల కేసీఆర్ వైఖరిని ఖమ్మం ప్రజలు ముందే గమనించారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి రాష్ట్ర ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

రూ.7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని తమకు కేసీఆర్ అప్పగించారని తెలిపారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టోడు కాబట్టే నిధులు సర్దుతున్నారని ప్రశంసించారు. అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 9వ తేదీలోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతా అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బకాయిలు విడుదల చేసిన వెంటనే అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాస్తవా? కేసీఆర్ అని ఛాలెంజ్ చేశారు.

Read More..

ఆఫ్ట్రాల్ ఢిల్లికి పిలిస్తే భయపడతామా? రేవంత్ రెడ్డికి నోటీసులపై భట్టి రియాక్షన్

Next Story

Most Viewed